పేదరికం, దోపిడీ, అసమానతలు లేని సమసమాజం కోసం జీవితాన్ని ధారబోసిన చేగువేరా ఆశయసాధనకు యువత పూనుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. మార్క్సిస్టు గెరిల్లా కమాండర్, క్యూబా సోషలిస్టు విప్లవకారుడు చెగువేరా 57 వ వర్ధంతి తి సందర్భంగా బుధవారం తణుకులో వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ చేగువేరా ప్రపంచంలో దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన సోషలిస్టు విప్లవకారుడన్నారు.దోపిడీ , అసమానతలు లేని సమసమాజ స్థాపనే ధ్యేయంగా 27 ఏళ్ల వయస్సులో తన చుట్టూ పెరుగుతున్న పేదరికం, దోపిడీలను చూసి చలించిపోయి విప్లవ పోరాట మార్గాన్ని ఎంచుకున్న చేగువేరా బాటలో యువత పయనించాలని భీమారావు కోరారు. గెరిల్లా పోరాట పద్ధతుల్లో విప్లవకారులకు తర్ఫీదు నిస్తున్న చేగువేరా పట్ల తీవ్ర ఆందోళనకు గురైన అమెరికా తన 39 వ ఏట హత్య చేయించిందన్నారు. పేదరికం, దోపిడీ, అసమానతలు లేని సమసమాజం కోసం చెగువేరా చూపిన తెగువ, సాహసం నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు.
సీపీఐ నాయకులు గార ప్రసాద్, గుబ్బల వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ, నూనె రాధాకృష్ణ, జార్జి తదితరులు పాల్గొని చేగువేరాకు నివాళులర్పించారు.
