యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి.
పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన – మంత్రి కందుల దుర్గేష్
క్రీడలు మానసిక వికాసానికి శారీరక దారుడ్యానికి ఎంతో దోహదపడతాయని, యువత క్రీడల పట్ల దృష్టిని సారించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
శనివారం స్థానిక ప్రభుత్వ బాలుర హై స్కూల్ నందు నిడదవోలు సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని యువత పెంపొందించుకోవాలన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని వాటిని సమానంగా స్వీకరించినప్పుడు భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు క్రీడా స్ఫూర్తితోనే పెరుగుతాయన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిడదవోలు నియోజకవర్గం లో పోలీస్ వారి ఆధ్వర్యంలో 14 బృందాలతో బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడలైన వాలీబాల్, కబాడీ,బాల్ బ్యాడ్మింటన్ పై యువత ఆసక్తిని పెంచుకోవాలన్నారు. త్వరలో నిడదవోలు పట్టణంలో మినిస్టేడియం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ మేరకు క్రీడామంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో సంప్రదించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళుతుందని ఆ మేరకు క్రీడా పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. క్రీడాకారులందరూ క్రీడల పట్ల తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించి విజయ లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, సీఐ పివిజి తిలక్, ఎస్సై పి. శోభన్ కుమార్, పీడీలు బి ప్రదీప్, కే వి డి ఎం స్వామి, పి శ్రీనివాస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.