బాధితులను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ
తరుచు రోడ్డు ప్రమాద ఘటనలు, గోదావరిలో మునిగి చనిపోతుండటంపై ఆవేదన
ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని వెల్లడి
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి దుర్గేష్ హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.విగతజీవులై ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తరుచు రోడ్డు ప్రమాద ఘటనలు,గోదావరిలో మునిగి పలువురు మృతి చెందుతుండటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో రోడ్డు మలుపు కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించిందన్నారు. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారని, మరో ఇద్దరికి గాయాలయ్యాయని తెలిపారు.ఘటనలో చిన్నారులు చనిపోవడం మనసు కలిచివేసిందన్నారు.బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.స్థానిక సాయి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఘటనాస్థలం నుండే వైద్య సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ త్వరితగతిన చేయాలని ఆదేశించారు.తరుచు రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా నిర్ణయాలు చేస్తామన్నారు. జనసేన సభ్యత్వం ఉన్న వారికి పార్టీ తరపున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు