రాష్ట్రాభివృద్ధికి ఏపీ ఎన్ఆర్టీ వారధిలా పని చేస్తుంది
ఎన్నారైల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తాం
మన విద్యార్థులకు విదేశాల్లో ఉగ్యోగవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు
ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్
ప్రపంచ వ్యాప్తంగా మా ప్రవాసాంధ్రుల అభ్యున్నతకి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఎపీఎన్ఆర్టీని తీర్చిదిద్దుతానని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ తెలిపారు. తెలుగుప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జన్మభూమి పథకంలో నాడు ఎన్ఆర్ఐలు భాగస్వాములై గ్రామాల రూపురేకల మార్పునకు కృషి చేశారు. ఇప్పుడు పీ4 విధానంలో భాగస్వాములై పేదరిక నిర్మూలనుకు కృషి చేస్తారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ఖండాంత్రాలు దాటి తెలుగు ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులుగా డా.వేమూరు రవికుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం తాడేపల్లిలోని సంస్థ కార్యాలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వాళ్లు ఎక్కడున్నా నంబర్ వన్ గా ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యామనికి అనుగుణంగా, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సూచనల మేరకు తాము పనిచేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్నారైలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తామని.., ఉద్యోగస్తులుగా ఉన్న ఎన్నారైలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. దీంతో పాటు విదేశాల్లో ఉన్న మన విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా మెరుగైన ప్రణాళికలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రముఖ సంస్థల్లో అత్యున్నతస్థానాల్లో ఉన్న తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మన విద్యార్థులకు ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం మంత్రి నారా లోకేష్ గారి దిశానిర్దేశం మేరకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహకారంతో అవసరమైన శిక్షణా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు.. మన తెలుగు విద్యార్థులు విదేశాల్లో ఉగ్యోగాలు సాధించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. ఇందుకోసం వివిధ దేశాల్లోని మన రాష్ట్ర ప్రభుత్వ కో-ఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని డా.వేమూరు రవి కుమార్ తెలిపారు.
మన ఎన్నారైలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కార్యకలాపాలు మెరుగయ్యేలా ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ తగినవిధంగా పనిచేస్తుందని దీని వల్ల మరింత మందిని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దే అవకాశముంటుందని డా. వేమూరు రవికుమార్ అన్నారు. ఇందుకోసం ఏపీ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి సహకారం తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎన్నారైగా మంత్రిగారి అనుభవం సొసైటీకి ఎంతగానో ఉపయోగపడుతుందని డా.రవి కుమార్ అభిప్రాయపడ్డారు. అలాగే సీఈవో హేమలత రాణి గారి అనుభవం కూడా సొసైటీ అధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
మంత్రి నారా లోకేష్ గారి సలహా మేరకు రాష్ట్రంలో ఎన్నారైల పెట్టుబడులను మరింత పెంచేందుకు కృషి చేస్తామని.. ఇందుకోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఒక వేదికగా పనిచేస్తుందని డా.వేమూరు రవికుమార్ వివరించారు. అంతేకాకుండా ఎన్నారైలకు భరోసాగా ఉండేందుకు ప్రత్యేక ఇన్సూరెన్స్ ప్యాకెజీలను అందుబాటులోకి తీసుకొచ్చి.. ఎన్నారైలకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుందన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యాలను విదేశాల్లోనూ ప్రోత్సహించడంతో పాటు ఆయా దేశాల్లో శ్రీవారి కల్యాణం, బెజవాడ దుర్గమ్మ పూజలు, శ్రీశైలం మల్లన్న అభిషేకాలను కూడా నిర్వహించే ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో ఎన్నారైల భాగస్వామ్యంతో రూ.950 కోట్లతో నిర్మించనున్న ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని డా.వేమూరు రవికుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన డా.వేమూరు రవి కుమార్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై వ్యవహారాలపై మంచి పట్టున్న వేమూరు రవికుమార్ గారు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు, శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు, ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీ ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ రాజశేఖర్, ఏపీస్ఎస్డీసీ ఎండీ గణేష్ కుమార్, IAS, ఏపీఎన్ఆర్టీ సొసైటీ సీఈవో హేమలత రాణి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వర్ల రామయ్య, బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చిరామ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్లు శేషుబాబు కానూరి, శాంతి, ఎన్నారై టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణ రవి, ఎన్నారై టీడీపీ కువైట్ విభాగం అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, ఎన్నారై మురళీ రాపాకతో పాటు పలువురు ఎన్నారైలు, మరియు నాయకులు పాల్గొన్నారు