కె.సావరం గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మజాతర మహోత్సవాలు జనవరి 13, 14, 15వ తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ మంగళవారం తెలిపారు. 10వ తేది శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ఈ జాతరమహోత్సవంలో భాగంగా తొలి రోజు 650 గ్రాముల బరువు కలిగిన నూతన బంగారు కిరీటాన్ని అమ్మవారికి జంగంచెరువు గ్రామం నుండి ఊరేగింపుగా టి.వేమవరం, కే.సావరం గ్రామంలో బ్రహండమైన ఊరేగింపుతో ముత్యాలమ్మ అమ్మవారికి అలంకరిస్తామని జాతరకమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ జాతర సందర్భంగా కే.సావరంలో గ్రామం మొత్తం విద్యుత్ దీపాల అలంకరణలు, సుమారు 14 అరప లైటింగ్ లు భారీగా అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలలో ప్రతిరోజు ప్రత్యేకపూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. సంక్రాంతి పండుగ అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు, కోలాట నృత్యాలు, చివరిరోజు అఖండ అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తామని సర్పంచ్ రామకృష్ణ తెలిపారు. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి పరిసర గ్రామప్రజలే కాకుండా, భారీసంఖ్యలో భక్తులు పాల్గొంటారని కమిటీసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.సావరం, టి.వేమవరం, జంగంచెరువు ముత్యాలమ్మ ఆలయకమిటీ సభ్యులు కాకర్ల నాని, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, కాకర్ల పాండు, బసవ రమణారావు, వర్రె రమేష్, మీసాల సురేష్, బొల్లాడ దొరబాబు, నార్ని నారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు.
