తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు, కమిటీ కో చైర్మన్ ఆరుమిల్లి రాధాకృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ మన జీవన విధానంలో అన్నింటికంటే ముఖ్యమైనది వైద్యం అన్నారు. భారత ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయ్ విద్యా, వైద్యం ఉచితంగా ఇస్తే మిగతావి ఏమి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదని అనేవారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైద్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలంటే కుటుంబాలు కుదేలైపోతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తే అందరికీ వైద్యం అందుబాటులో ఉండి, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారని అన్నారు. తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి తొలి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటుకు ఆలోచన చెసి ఆ దిశగా చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. అత్తిలిలో కూడా డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తణుకు ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పనుల అంచనాల నివేదికను అందజేస్తే అవసరం మేరకు నిధులను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు ఏ గ్రాంట్స్ వచ్చిన తొలి ప్రాధాన్యతను వైద్యానికి అందజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్వీర్యం అయిపోయాయని, మళ్లీ వాటికి పునర్జీవం కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.ఐదు లక్షలు పరిహారం అందుకోవచ్చని, 75 సంవత్సరాలు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేలా పెంచడం జరిగిందన్నారు. దేశంలో 2014 నుండి 2024 వరకు 800 మెడికల్ కాలేజీలను, అంతకుముందు 50,000 ఉన్న మెడికల్ సీట్లను 1,10,000 కు పెంచడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్ ఉండగా మన రాష్ట్రంలో ఒక ఎయిమ్స్ మంగళగిరిలో వెయ్యి పడకలతో రూ.170 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ మరియు ఆస్పత్రి అభివృద్ధి సంఘం చైర్ పర్సన్ శ్రీమతి చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై తరచూ సమీక్షలు చేయడంతో మంచి సర్వీసులను ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. కాయకల్ప ప్రోగ్రాం కింద రాష్ట్రవ్యాప్తంగా 10 అవార్డులు ఇవ్వగా మన జిల్లాలోని ఆరు ఆసుపత్రులకు అవార్డులు అందుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఒక అవార్డు తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి, ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రావడం జరిగింది అన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య నిమిత్తం ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనను పంపడం జరిగిందని తెలిపారు. అలాగే ఐసీయూ, ఎమ్ ఆర్ ఐ, సిటీ స్కాన్ ఏర్పాటుకు 16వ ఫైనాన్స్ ఫండ్స్ నుండి మంజూరుకు ప్రతిపాదనను సమర్పించడం జరిగిందన్నారు. ఆసుపత్రి నూతన భవనాల ఏర్పాటుకు పాత బిల్డింగులను కూల్చేందుకు అవసరమైన అనుమతులు, బ్లడ్ బ్యాంకు, డిస్టిక్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపడం జరిగిందన్నారు. అవసరమైన అనుమతులు, నిధులు అందిన వెంటనే ఆస్పత్రి అభివృద్ధికి పనులను ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
తణుకు శాసనసభ్యులు మరియు ఆస్పత్రి అభివృద్ధి సంఘం కో చైర్మన్ ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ 2014- 2019 మధ్య టిడిపి ప్రభుత్వం జిల్లా ఆస్పత్రికి అప్డేట్ చేసే వంద పడకల ఆసుపత్రిలో అదనంగా 50 పడకలను మంజూరు చేయడం జరిగిందన్నారు. అప్పటి టిడిపి ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వంతోనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన పనులకు 16 వ ఫైనాన్సు నిధులకు ప్రతిపాదనను పంపడం జరిగిందన్నారు. అత్యవసర మరమ్మత్తుల నిమిత్తం రూ.76 లక్షల ప్రతిపాదనను కూడా పంపడం జరిగింది అని తెలిపారు. తణుకు ఆసుపత్రి నందు ప్రధానంగా ఐసియు, సిటీ స్కాన్, ఎమ్ ఆర్ ఐ, ట్రామా కేర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి ప్రతిపాదనను నివేదించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. లైన్స్ క్లబ్ సహకారంతో ప్రస్తుతం 10 యూనిట్ల డయాలసిస్ కు అదనంగా మరో ఐదు యూనిట్లు ఏర్పాటు చేస్తే మొత్తం మొత్తం 15 యూనిట్లకు పెంచడం జరిగిందని తెలిపారు. బ్లడ్ బ్యాంకు కూడా నిధులను కేటాయించడం జరిగిందని త్వరలో అందుబాటులో తీసుకు రావడం జరుగుతుందని తెలిపారు. నెలల నిండకముందే పుట్టిన చిన్నారులకు వెంటిలేషన్ యూనిట్ అవసరం ఉందని దీనికి ఎస్ ఎం సి యు యూనిట్స్ ను అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని, సిబ్బంది కొరతను తీర్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తణుకు నియోజవర్గంలో వివిధ పనుల నిమిత్తం రూ.1.5 కోట్లు పార్లమెంటు సభ్యులు నిధులను అందజేసినందుకు కేంద్రం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అత్తిలిలో రూ.75 లక్షలతో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సింథటిక్ ఒక ట్రాక్ కు రూ.30 లక్షలు, ఇరగవరం గ్రామంలో స్మశాన వాటిక అభివృద్ధికి రూ.20 లక్షలు, వేల్పూరు వాకింగ్ ట్రాక్ కు రూ.25 లక్షలు ఖర్చు చేయునట్లు తెలిపారు. రానున్న ఆరు నెలల్లో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ డా.పి.సూర్యనారాయణ, మెంబర్ కన్వీనర్ డాక్టర్ వి.అరుణ, కమిటీ సభ్యులు వల్లూరి గంగరావు, సుంకర ప్రసాద్, వి. జాన్ లిల్లీ, టి.రామ్ కుమార్, యు ఎస్ వై రాజాబాబు, కె ధనలక్ష్మి కిరణ్మై, విజయవత్ కనరాజ్, డా.అయేషా ఖాన్ పతాన్, తదితరులు పాల్గొన్నారు.