-వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమే లక్ష్యం – -సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక కార్యాచరణ
– యూనియన్ గౌరవాధ్యక్షులు డా. కంచర్ల అచ్యుతరావు
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ)కి త్వరలోనే విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని యూనియన్ గౌరవాధ్యక్షులు, ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సంఘ సేవకులు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూనియన్ పనిచేస్తుందన్నారు. సభ్యుల కమ్యూనికేషన్ కోసం కేరాఫ్ అడ్రస్ కల్పించేందుకు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ తయారు చేశామని ఆదిశగా కార్యక్రమాలు చేపట్ట నున్నామన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు అత్యవసరం కావాల్సిన సదుపాయాలనే ముఖ్యంగా దృష్టిపెట్టి వాటిని కార్యరూపం దాల్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ జిల్లా కార్యవర్గం దాదాపు పూర్తయిందని రాష్ట్ర కమిటీ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నామన్నారు. ఏపీజేయూలో చేరే జర్నలిస్టులకు చేపట్టే కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నామన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ సుధీర్ఘ అనుభవం జర్నలిస్టు సంఘ నాయకులు ఏపీజేయూలో ఉన్నారని వారిఆలోచనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ యూనియన్ ను బలోపేతం చేసేందుకు కూడా అడుగులు పడుతున్నాయని డా. కంచర్ల అచ్యుతరావు వివరించారు.