ఎర్రకాల వరదలకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం నెలలోపే అందించే ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని ఆరోళ్లలో బుధవారం ప్రజా పరిష్కార వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు సేవ చేసే బాధ్యత తమపై ఉందని అందులో భాగంగానే గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం రోడ్లు డ్రైన్లు గ్రావెల్ రోడ్లు కల్వర్తులు అన్నీ కలిపి అధికారులతో ప్రణాళిక రూపొందించి రూ 17 లక్షల ప్రతిపాదనలు సిద్ధం చేశామని త్వరలోనే ఆ నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వాటితోపాటు గ్రామంలో ప్రజల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరించారు. గ్రామంలో మంచినీటి కీ ఇబ్బంది ఉందని నిధులు కావాలని సర్పంచ్ కోరగా జలజీవన్ మిషన్ ద్వారా ఆ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సిర్రా ప్రసాదు, చదలవాడ మహాలక్ష్మిలకు ఎమ్మెల్యే స్వయంగా తన సొంత నిధులతో రూ 10,000 ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాకరాజు వరలక్ష్మి, మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్, మండల నాయకులు మైలవరపు రాజేంద్రప్రసాద్, పాలూరు వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు గూడవల్లి నాగేశ్వరరావు, బెజవాడ శ్రీను, చిటకన శ్రీను, మాన్యం రామదాస్, నాయకులు మాకరాజు సతీష్, తదితరులు పాల్గొన్నారు.
