సమాజంలో పిల్లలు, ఆడ, మగ అనే లింగ వివక్షత చూపరాదని ఉండ్రాజవరం మండల తహశీల్దార్ పి.ఎన్డి.ప్రసాద్ సూచించారు. సోమవారం మండల కేంద్రం, వెలుగుకార్యాలయంలో ఏపిఎం టి.బాలకోటయ్య అధ్యక్షతన నిర్వహించిన లింగవివక్షతపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలోని ప్రజలు, వివిధ భాగస్వాములు, లింగ సమానత్వ సమస్యలపై దృష్టి సారించడానికి స్వయం సహాయక సంఘాలు, వివిధ ప్రభుత్వ విభాగాలు, వివిధ పౌర సమాజ సంస్థలు మధ్య కలయిక సులభతరం చేయడానికి, సమాజంలో ప్రవర్తన, మార్పు తీసుకురావడానికి, వివిధ లింగ సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి దీర్ఘకాలిక జాతీయప్రచారం చేపట్టాలని ఎంపీడీవో వి.వి.వి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక సహించం, గళం విప్పుతాము, హింసకు వ్యతిరేకంగా కలిసికట్టుగా ఒకే స్వరం అంటూ డ్వాక్రా సంఘ మహిళలు, అంగన్వాడీలచే ప్రతిజ్ఞ చేయించి, అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా నెలరోజుల పాటు నిర్వహించు రోజు వారి కార్యక్రమాలలో భాగంగా వివిధరకాల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ విస్తరణాధికారి శర్మ, సీ.సీ.లు ఏ.సుబ్బారావు, వి.నాగమణి, జి.మణికుమారి, కేర్ టేకర్ మంగ తదితరులు పాల్గొన్నారు.
