ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంతగృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సోమవారం తాడేపల్లిగూడెం 24, 25 వార్డులల్లో పేదలకు ఇళ్ళ స్థలాలు దరఖాస్తులు పంపిణీచేసి దరఖాస్తులు పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ళులేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు కేటాయిస్తామన్న వాగ్దానం అమలు చేయాలని కోరారు. అలాగే గతప్రభుత్వం ఇచ్చిన జగనన్న నివేశనస్థలాల లబ్ధిదారులకు పట్టణాల్లో సెంటుకు బదులుగా 2 సెంట్లు, గ్రామాల్లో సెంటున్నరకు బదులు 3 సెంట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెరవేర్చాలని కోరారు. అలాగే గృహనిర్మాణానికి 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాంప్రసాద్, తాడేపల్లిగూడెం సీపీఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు,వడ్డాది మేరీ,నిమ్మకాయలు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
