శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామములలో పొలం పిలుస్తోంది


శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామములలో పొలం పిలుస్తోంది కార్యక్రమం గురువారం నిడదవోలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు సహాయ వ్యవసాయ సంచాలకులు పి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు నూతన వంగడాలు సాగు వివరాలు పంటల యొక్క ఉత్పత్తి పెంచడానికి, సాగుఖర్చు తగ్గించడానికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది అని, రైతులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న పధకాల గురించి వివరించడం జరుగుతుంది అని, దీనిని ప్రతీ రైతు వినియోగించు కోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో సార్వా వరి పంటకు ముఖ్యంగా పి.ఎల్.ఏ-1100, పిఆర్ 126, సంపద స్వర్ణ వంటి రకాలలో “ఎండాకు తెగులు” సోకిందని, అధిక నత్రజని వినియోగం, పోటాస్ ఎరువు వాడకపోవడం, సాగునీరు, వర్షపు నీటి ద్వారాను తెగులు వ్యాపిస్తుందని, దీని నివారణకు, నత్రజని ఎరువులు వేయడం ఆపివేసి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు 20 కిలోలు చల్లుకోవాలన్నారు. నీటిని తీసివేసి, పొలం ఆరబెట్టి, తదుపరి నీరు ఇవ్వడం చేయాలన్నారు. ఉధృతి ఎక్కువగా ఉంటే, తీవ్రతను తగ్గించడానికి ప్లాంటోమైసిన్ 1.0 గ్రాము మరియు కాపర్ హైడ్రాక్సైడ్ 2.0 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. అవసరం బట్టి 7-10 రోజులలో మరో పర్యాయం పైమందు పిచికారి చేయాలన్నారు.
ప్రస్తుత వాతావరణంకు, దోమ వచ్చే అవకాశం ఉన్నందున, దోమ కనిపించిన మీదటఏంటనే పంట క్రింది భాగం తడిచేటట్టు, పైమెట్రోజైమ్ 0.6 గ్రా (చెస్ ) లేదా ట్రైఫ్లూమిజోపిరమ్ (పెక్సలాన్ )0.48 మి.లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది మాట్లాడుతూ వరి లో దోమ పోటు నివారణకు తూటు కాడ కాషాయం బాగా పని చేస్తుందని, దానిని తయారు చేసే విధానం వివరించారు ఈ కార్యక్రమం లో గ్రామ వి.ఏ.ఏ భానుశేఖర్, వినయ్, రైతులు గంటా విజయ్, గంటా సోమన్న, కటికరెడ్డి చినబాబు, సింగూలూరి సతీష్, పినిశెట్టి సూర్య చంద్రం, పినిశెట్టి రవితేజ, పాలకోడేటి గోపినాధ్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link