నోటీసులు వెనక్కు తీసుకోక పోతే ఉద్యమం చేపడతాం
ఆర్డీవో శ్రీలేఖ నిరంకుశత్వంపై గళమెత్తిన దళిత మహిళ ప్రజా సంఘాలు జర్నలిస్టు యూనియన్ల హెచ్చరిక
విశాఖ ఆర్డీవో శ్రీలేఖ వ్యవహారంపై దళిత, మహిళా ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్, ‘లీడర్’ సంపాదకులు వీవీ రమణ మూర్తికి విశాఖ ఆర్డీవో శ్రీలేఖ తనకు లేని అధికారాల్ని కట్టబెట్టుకుని చట్ట విరుద్ధంగా నోటీసిచ్చిన విషయం తెలిసిందే. ఆర్డీవో శ్రీలేఖ పంపిన నోటీసులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ, చట్ట విరుద్ధంగా ఉన్నాయని, దానిని వ్యతిరేకిస్తూ శనివారం నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాస్వామ్య వాదులంతా భగ్గుమన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా శ్రీలేఖ నోటీసులు పంపించి బెదిరింపులకు పాల్పడేలా అందులో సారాంశం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు వాస్తవాలు వెల్లడి చేసే హక్కు ఉందని, ఆమె పంపిన చట్ట విరుద్ధమైన ఈ నోటీసు మాత్రం దానిని నిరాకరిస్తోందన్నారు. విశాఖలో అనేక భూముల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని, నిత్యం పత్రికలు, చానెళ్లు వాటిని వెలుగులోకి తెస్తున్నాయని గుర్తు చేశారు. ఆర్డీవో శ్రీలేఖ పంపిన నోటీసు ప్రకారమైతే వాటిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం దృష్టికి, ప్రజలకు తెలియజేయకూడదా అంటూ వారంతా ఎద్దేవా చేశారు. వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువచ్చే మీడియాను బెదిరిస్తారా అని వారంతా ప్రశ్నించారు. నోటీసుల్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్స్ యూనియన్లతోÊ కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆర్డీవో శ్రీలేఖను సస్పెండ్ చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా నోటీసులు పంపిన ఆమెపై చర్యలు తీసుకునేలా భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తున్నట్టు వెల్లడిరచారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి, రాజకీయ ఖైదీల విడుదల కమిటి కన్వీనర్ న్యాయవాది కె.పద్మ, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు డెంకాడ ఆనంద్, ఏపీడబ్ల్యూజే నాయకులు, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎంఆర్ఎన్ వర్మ, ఏపీ జర్నలిస్ట్ సంఘం నాయకులు ఈఎన్ఎస్ బాలు, భీమ్సేన్ వార్ నాయకులు డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్, టీడీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ వీవీ గిరి, ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధి మాస్టర్ కిషోర్, కాంగ్రెస్ నాయకులు సోడదాసి సుధాకర్, చైతన్య మహిళా సమైక్య నాయకులు లలిత, భారత నాస్తిక సమాజం ప్రతినిధులు జె.శ్యామల విజ్ఞానంద్, పీవోడబ్ల్యూ జిల్లా ప్రెసిడెంట్ వెంకటలక్ష్మి, అరుణోదయ ప్రతినిధి బాలనాగమ్మ, ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వాల్మీకీ నాగరాజు, ‘విదసం’ బూసి వెంకటరావు, ముదపాక భూ బాధితుల సంఘం ప్రతినిధి నీలాపు రమణ, ఇతర నేతలు, తదితరులు పాల్గొన్నారు.