పోలింగ్ శాతంలోను అదే దూకుడు
జిల్లాలో పోలింగ్ శాతంలో “తణుకు” ప్రథమ స్థానం
జిల్లాలో అత్యధికంగా 73.59 శాతం పోలింగ్ నమోదు
సత్ఫలితాలు ఇచ్చిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్షలు, సూచనలు
ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తణుకు నియోజకవర్గ కూటమి క్యాడర్ కీలక పాత్ర పోషించింది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమన్వయంతో మొదటి నుంచి పార్టీ కేడర్ ఉత్సాహం చూపించింది. ముఖ్యంగా పాఠశాలలు, ప్రధాన సంఘాలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాలు అత్యధికంగా పోలింగ్ నమోదు కావడానికి దోహదపడ్డాయి.
ఎప్పటికప్పుడు కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు నమోదులోను, ఓటర్లను చైతన్య పరచడంలోనూ ఎమ్మెల్యే రాధాకృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారంతోపాటు ప్రతి 50 మంది ఓటర్లకు ఇన్చార్జిని నియమించి ఒక్కో ఓటర్ ను కనీసం మూడుసార్లు కలిసేలా ప్రణాళికలు చేయడం సత్ఫలితాలు ఇచ్చింది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు పడిన శ్రమ వృధా కాకుండా జిల్లాలోనే తణుకు నియోజవర్గంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం విశేషం. ప్రధానంగా పట్టభద్రుల ఓటర్లను చైతన్యపరిచి ఓటు నమోదులో కీలకంగా వ్యవహరించిన కేడర్ అదే ఉత్సాహంతో ఓటర్లను పోలింగ్ స్టేషన్ వరకు తీసుకువచ్చి ఎన్నికల్లో పాల్గొనేలా చేయడంతో విజయం సాధించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధికంగా తణుకు నియోజవర్గంలో 73.59 శాతం పోలింగ్ నమోదయింది. తణుకు నియోజకవర్గంలో తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో 12,793 మంది ఓటర్లు ఉండగా వీరిలో 9,414 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలోని అత్యధికంగా 73.59% ఓట్లు పోలయ్యాయి. ఓట్లు నమోదు లోను పార్టీ కేడర్ క్షేత్రస్థాయిలో సమన్వయంతో అత్యధికంగా ఓటర్లు తమ ఓటును నమోదు చేయించుకోవడం విశేషం.