రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 14 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.11.62 లక్షల చెక్కులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శాంతినగర్ లోని తన కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని ఎంపీ ఆరోపించారు. వైఎస్ఆర్సిపి పాలనలో మిగిల్చిన గాయాల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఎంపీ తెలిపారు. ఒకసారిగా సమస్యలు వచ్చి రాష్ట్రంపై పడ్డాయని, వాటన్నింటినీ అధిగమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారని ఎంపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంపీ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మరంగా జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జలవదుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎంపీ తెలిపారు.
