సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక వేదిక
కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఇకపై వారానికో సారి కార్యకర్తల కోసం కేటాయించి వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకునేందుకు వారి నుంచి వనతులు స్వీకరించడానికి ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. మంగళవారం కూటమి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వ్యక్తిగతంగా కలుసుకుని వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. గతం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎన్నో కేసులు నమోదు చేసి అక్రమ కేసులు పెట్టించుకున్నారని అన్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసి వారి సమస్యలను తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు, పార్టీ సంస్థాగత పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఆర్థిక పరమైన సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం, పార్టీ పరంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కార్యకర్తలను బయటపడేసే విధంగా వారికి ఉపాధి కల్పన వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 40 ఏళ్లుగా పార్టీను నమ్ముకుని ఉంటున్న వారికి ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు రాని వారిని గుర్తించి వారికి పార్టీలో గౌరవ ప్రదమైన స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.