ఇదే ఒరవడి భవిష్యత్తులో కొనసాగించాలి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చూపించి ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు డివిజన్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో తణుకు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి పడాల కావ్యశ్రీ 600 మార్కులకు గాను 587 మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. అంతేకుండా తణుకు రూట్స్ స్కూలు విద్యార్థి యు.హన్సిత పద్మిని 596 మార్కులు సాధించిందని కొనియాడారు. తల్లిదండ్రులను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి నారా లోకేష్ సారధ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు చేపట్టి విద్యావ్యవస్థను బలోపేతం చేశారని చెప్పారు. దశాబ్థ కాలంలో రాని ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 82 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకువచ్చారన్నారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా హాల్టికెట్లు, ఫలితాలు వెల్లడించి పారదర్శకంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు వినియోగించుకుని విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.