- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ను ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్
- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సిబిఐ డైరెక్టర్ కు తెలుగు శక్తి ఫిర్యాదు
- పల్లా అనుచరుడి ఆరోపణలపై తన పైనా, పల్లా శ్రీనివాసరావు పైనా సిబిఐ చేత విచారణ చేయాలని విజ్ఞప్తి
- ఇప్పటికే పల్లాపై గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- తనతో రణమో శరణమో తేల్చుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ను ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ సవాల్ చేశారు. ఇదే విషయమై దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మధ్యాహ్నం మీడియాతో ఆయన మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా పల్లా అనుచరుడు ప్రసాదుల ఒక ప్రకటన విడుదల చేశారన్నారు. బి.వి.రామ్ ఒక లుచ్చా, బ్లాక్ మైలర్, తెలుగు శక్తికి అధ్యక్షుడు కాదు తెలుగు బ్రోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. పల్లా అనుచరుడు చేసిన ఆరోపణలు నిజమో కాదో తెలియాలంటే తన పైనా, పల్లా శ్రీనివాసరావు పైనా సిబిఐ చేత విచారణ జరిపించాలని.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సిబిఐ డైరెక్టర్ కు విజ్ఞప్తి చేశామన్నారు. అంతే కాకుండా తనకు పల్లా నుంచి ప్రాణ హాని ఉందని తనకు తగిన రక్షణ కల్పించాలని కేంద్రం హోం మంత్రిని కోరామని తెలిపారు.
- దశాబ్దాల నుంచి రాజకీయ అనుభవం
- తన కుటుంబానికి దశాబ్దాల నుంచి రాజకీయ అనుభవం ఉందని, వాజ్ పేయి ప్రభుత్వంలో తన పెదనాన్న కేంద్ర వ్యవసాయ మంత్రి గా పని చేసారన్నారు. అయినప్పటికీ తాను ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇదే క్రమంలో గత వైసీపీ అరాచక పాలనపై పోరాటం చేశానని తెలిపారు.
- పల్లా అక్రమాలపై ఒక ఫైల్ సిద్ధం గా ఉంది
- చంద్రబాబు జన్మదిన వేడుకలను విశాఖలోని హోటల్ దశపల్లా లో ఘనంగా నిర్వహించానన్నారు. అయితే ఆ వేడుకలకు హాజరు కాకుండా అనేక మందిని పల్లా అడ్డుకున్నారని ఆరోపించారు. వచ్చిన వారిని పల్లా అనుచరులు బెదిరిస్తున్నారని రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు చంద్రబాబు ను తాను కలవకుండా పల్లా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పీ.ఏ రాజగోపాల్, పీ.ఎస్ కపర్థి తన ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారన్నారు. చంద్రబాబు ను తాను చివరిసారిగా గత ఏడాది అక్టోబర్ 10న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కార్యాలయంలో చివరిసారిగా కలిశానని తెలిపారు. అప్పుడు కూడా వ్యక్తి గత సిబ్బంది ఆటంకాలు సృష్టించారన్నారు. ఇప్పుడు వారిద్దరికీ పల్లా శ్రీనివాస్ తోడై చంద్రబాబు ను తనను కలవకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ లోగా తన కోసం చంద్రబాబు వద్ద తప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా తాను ఒక్కసారి చంద్రబాబ ను కలిస్తే పల్లా శ్రీనివాస్ అక్రమాల చిట్టాకు సంబంధించిన ఫైల్ ను అందజేస్తామని పేర్కొన్నారు.
