కూటమి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలకు నిరూపించుకుంటున్నామని అన్నారు. అత్తిలి మండలం కంచుమర్రు, లక్ష్మినారాయణపురం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ రూ. 1.18 కోట్లు విలువైన అభవృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పేరుతో రూ. 20 వేలు ఇస్తామనే హామీ నెరవేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉనప్పటికీ అందరికీ తల్లికి వందనం పేరుతో రూ. 15 వేలు ఇవ్వడానికి ఈ ఏడాది నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు చేయడంతోపాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల షెడ్లు నిర్మించేందుకు రైతులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కంచుమర్రు, లక్ష్మీనారాయణపురం గ్రామ సర్పంచులు వెంకటకృష్ణంరాజు, నాగేశ్వరరావులు గ్రామాల అబివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, దేశ ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతోపాటు పైనుంచి కింది స్థాయి వరకు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రబీ సీజన్‌లో ధాన్యం విక్రయించిన 12 గంటల్లోపు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గత అయిదేళ్ల వైసీపీ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కనీసం రెండు మూడు నెలల తర్వాత గానీ డబ్బులు జమ కాని పరిస్థితి ఉండేదన్నారు. తణుకు నియోజకవర్గంలోనే రూ. 200 కోట్లుపైగా ధాన్యం కొనుగోలు ద్వారా రైతులకు చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ. 1.18 కోట్లుతో అభివృద్ధి పనులకు శ్రీకారం….

అత్తిలి మండలం కంచుమర్రు గ్రామంలోరూ. 6 లక్షల నిధులతో పెద్దపేట డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన, పంచాయతీ నిధులతో కాలువ రేవు నిర్మాణానికి శంకుస్థాపన, రూ. 3 లక్షల మండల పరిషత్‌ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం రూ. 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. రూ. 3 లక్షల ఎంపీపీ నిధులతో నిర్మించిన కృష్ణుని గుడి కమ్యూనిటీ హాలు ప్రారంభం, అసంపూర్తిగా నిలిచిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం రూ. లక్ష ఎంపీపీ నిధులతో హెల్త్‌ సెంటర్‌ వద్ద విశ్రాంత షెడ్డు ప్రారంభించారు. రూ. 10 లక్షల ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులతో మంచినీటి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన, అసంపూర్తిగా నిలిచిన సచివాలయ భవనం అభివృద్ధి చేసి ప్రారంభించారు. లక్ష్మీనారాయణపురంలో సైతం రూ. 68 లక్షలతో వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన, రూ. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు.

Scroll to Top
Share via
Copy link