మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

నియోజకవర్గంలో నాలుగు కేంద్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ

వేల్పూరులో శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఆదివారం ప్రారంభించిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 46 వేల యూనిట్లు ప్రారంభించి మొదటి దశలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో మొదటి దశలో 650 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గంలో తణుకు మున్సిపాలిటీతో పాటు ఇరగవరం, అత్తిలి, వేల్పూరు గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాదర్శికంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మహిళలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వం కుట్టు మిషన్లు అందజేసి ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా వారికి ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. కేవలం మొక్కుబడిగా కాకుండా శిక్షణలో అన్ని మెలకువలు తెలుసుకొని దేశ విదేశాల్లో రాణించే విధంగా తర్ఫీదు పొందాలని సూచించారు. 90 రోజులపాటు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకొని మహిళలు రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ప్రభుత్వం శిక్షణ అందజేసి వారికి అన్ని విధాలుగా సహకరిస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, బిజెపి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link