నిడదవోలు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులకు కృషి చేస్తున్నానన్న మంత్రి దుర్గేష్
అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా నిడదవోలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని వెల్లడించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు పట్టణ రూపురేఖలు సమూలంగా మార్చి ప్రత్యేక పట్టణంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయము నందు మున్సిపల్ కౌన్సిలర్ల సాధారణ సమావేశం నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్ ఎక్స్అఫిషియో హోదాలో హాజరయ్యారు. కౌన్సిలర్స్ సమావేశంలో ప్రవేశపెట్టిన వివిధ అంశాలపై చర్చించి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. కౌన్సిల్ సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తున్నానని, దీనిలో భాగంగానే అఖండ గోదావరి ప్రాజెక్ట్, టెంపుల్ టూరిజం, గోదావరి పుష్కరాల నిధులు, ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి నిడదవోలు నియోజక వర్గాన్ని మునిపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, నిడదవోలు పురపాలక సంఘ కార్యవర్గం కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించి నిడదవోలును మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నిడదవోలుకు నిధుల జాతర: మంత్రి దుర్గేష్
నిడదవోలు పట్టణం అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.90 లక్షల నిధులు తీసుకురావడం జరిగిందని మంత్రి దుర్గేష్ అన్నారు. అంతేగాక రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా పట్టణ అభివృద్ధి కోసం దాదాపు కోటి రూపాయల నిధులు తీసుకొస్తున్నామన్నారు. ఇవేగాక కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కి ద్వారా రూ. 98 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు.. ఆ ప్రాజెక్టులో నిడదవోలును అంతర్భాగం చేసి నిడదవోలు పర్యాటక అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.. ప్రధానంగా నిడదవోలులోని గోదావరి కాలువలో బోటింగ్, రెస్టారెంట్ల ఏర్పాటు, కోట సత్తెమ్మ ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు.. రాష్ట్ర మంత్రిగా, నిడదవోలు శాసనసభ్యుడిగా పట్టణం అభివృద్ధి కోసం అందరితో చర్చించి నిధులు రాబడుతున్నానన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి తొలుత ప్రతిపాదించిన డిపిఆర్ స్థానంలో మరో డిపిఆర్ పంపించి అందులో నిడదవోలును అంతర్భాగం చేసేందుకు కృషి చేశానన్నారు.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా అఖండ గోదావరి, గండికోట అభివృద్ధికి రూ.177 కోట్లు మంజూరైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
క్రీడా వికాస్ ద్వారా నిడదవోలు మున్సిపల్ ఇండోర్ స్టేడియం అభివృద్ధి: మంత్రి దుర్గేష్
క్రీడా వికాస్ పథకం ద్వారా నిడదవోలు మున్సిపల్ ఇండోర్ స్టేడియం చేపడతామని మంత్రి వెల్లడించారు. తొలుత 27 లక్షలతో చేపట్టిన స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరో రూ. 3 కోట్లు అవసరమవుతాయని, ఈ క్రమంలో సంబంధిత నిధులు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించానని మంత్రి తెలిపారు.
నిడదవోలు పట్టణానికి గోదావరి జలాలు: మంత్రి దుర్గేష్
నిడదవోలు పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు గోదావరి జలాలను తీసుకొస్తామని మంత్రి అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.. అమృత్ పథకం ద్వారా మంచినీరు సరఫరాకు కృషి చేస్తామన్నారు.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతలు పూడ్చి వేస్తాం: నిడదవోలు నియోజకవర్గంలో సంక్రాంతి నాటికి గుంతలు పూడ్చివేత కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.. త్వరలోనే కొత్త రోడ్ల ఏర్పాటు అంశం ఆలోచిస్తామన్నారు.. రోడ్లపై గుంతలు పూడ్చి వేసేందుకు సాధారణ నిధుల నుండి రూ. 45 లక్షలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు అటు కేంద్ర సహకారంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఇతర మంత్రుల సహకారం తీసుకుంటున్నానని, పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు సేకరించేందుకు కృషి చేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.. దశలవారీగా అభివృద్ధి చేపట్టేలా కార్యాచరణ తయారు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దుర్గేష్ సూచించారు.