కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో తాత్సర్యం, తడబాటు, డొంక తిరుగుడు విధానాలకు పాల్పడటం ప్రజలను మోసగించడమేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. మంగళవారం తణుకు విచ్చేసిన ఆయన సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ ప్రత్యక్షంగా ఎనిమిది వేల కోట్లు, రెగ్యలేటరీ అధారిటీ పేరుతో మరో పదకొండు వేల కోట్లు ప్రజలపై మోయలేని భారం మోపడం దారుణమని విమర్శించారు. ఛార్జీల పెంపు రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయమని పాలకులు చెప్పడాన్ని ఆయన తప్పు పడుతూ రెగ్యులేటరీ అథారిటీ సుప్రీం కాదని ప్రభుత్వం కనుసన్నల్లోనే నడుస్తుందని స్పష్టం చేశారు. గత విద్యుత్ ఒప్పందంలో అదాని 1750 వేల కోట్లను నాటి సర్కారు పెద్దలకు ముట్టచెప్పినట్లు వచ్చిన వార్తలపై కూటమి సర్కారు ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రక్కనే తమిళనాడు అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసిందని, మోడీపై భయంతోనే కూటమి దీనిపై పెదవి విప్పడం లేదని ముప్పాళ్ల నిప్పులు చెరిగారు. కూటమి సర్కారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైనా, పిల్ల దొంగలు పైనా చర్యలు తీసుకుంటున్నారని వైకాపా అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులపైనా, అడ్డంగా దోచేసిన నాయకులపైనా చర్యలు లేకపోవడం ఆశ్చర్యంగా వుందని ముప్పాళ్ల పేర్కొన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని తేమ, తాలు పేరుతో రెండు మూడు వందలు తెగ్గోస్తున్నారని ఇతర పంటలదీ అదే పరిస్థితి అని ఆయన ద్వజమెత్తారు. ఇళ్ళు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు కేటాయిస్తామన్న వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న నివేశనా స్థలాల లబ్ధిదారులకు పట్టణాల్లో సెంటుకు బదులుగా రెండు సెంట్లు,గ్రామాల్లో సెంటున్నరకు బదులు మూడు సెంట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెరవేర్చాలని కోరారు.అలాగే గృహ నిర్మాణానికి 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జగన్ సెంటు ఇచ్చి కేంద్రం ఇచ్చిన లక్షా ఎనబై వేలను తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నాడని ఇచ్చిన స్ధలాలు కూడా ముంపు ప్రాంతంలో ఇచ్చాడని 32 లక్షల ఇళ్లు నిర్మిస్తానని గాలికొదిలేశాడని విమర్శించారు. జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాల భూ సేకరణలో వైకాపా కోట్లల్లో దిగమింగిందని ముప్పాళ్ల దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ నెల 10న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని, వచ్చే నెలలో కలెక్టరేట్ లో వద్ద ఆందోళనలు చేపడతామని, అప్పటికి ప్రభుత్వం దిగిరాక పోతే ఇళ్ల స్థలాల సాధన సమితి ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. విశాఖ ఉక్కుకై 32 మంది అసువులు బాశారని, 57 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ముప్పాళ్ల స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరించమని, విశాఖ ఉక్కుకు గనులు కేటాయిస్తామని స్పష్టమయిన హామీని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా ప్రకటించేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్యలకు ఉపక్రమించాలని ముప్పాళ్ల డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు,సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సికిలే పుష్ప కుమారి, పట్టణ సమితి సభ్యులు బొద్దాని కృష్ణ కిషోర్, బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
