సబ్ డివిజన్ పరిధిలో 300 మంది బైండోవర్
తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాద్
సంక్రాంతి పురస్కరించుకుని కోడిపందేలు, పేకాట, గుండాట తదితర చట్టవ్యతిరేక జూదక్రీడలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనా«ద్ హెచ్చరించారు. తణుకు పట్టణ పోలీసు స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తణుకు పట్టణ, రూరల్ సర్కిళ్ల పరిధిలో శాంతిభద్రతలు కాపాడే ఉద్దేశంతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలైన కోడిపందేలు, జూదం, గుండాట వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచామన్నారు. ఇప్పటికే తణుకు, తణుకు రూరల్ సర్కిల్ పరిధిలో 155 మందిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 300 మందిని బైండోవర్ చేశామన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఎవరైనా కోడిపందేలు నిర్వహించినా, పందేల నిర్వహణకు స్థలాలు, భూములు ఇచ్చినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో తణుకు పట్టణ, రూరల్ సీఐలు కొండయ్య, కృష్ణకుమార్, రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
