ప్రసిద్ధ హేతువాది, సామాజిక ఉద్యమకారుడు, రచయిత భారతదేశంలోని మతపరమైన అంధ విశ్వాసాలను సవాలు చేసిన నాస్తిక వాది, భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ల వ్యవస్థాపకులు డాక్టర్ జయ గోపాల్ ప్రథమ వర్ధంతిని ఈనెల తొమ్మిదో తేదీన పౌర గ్రంధాలయంలో నిర్వహిస్తున్నట్లు భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ నాయకులు టి శ్రీరామమూర్తి, జె.రవి ఆరిలోవలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలియజేశారు. బాల్యం దశ నుండి సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను ఆచార సంప్రదాయాలను వ్యతిరేకించిన జయ గోపాల్ అంతర్జాతీయ స్థాయి నాయకులని, ఆయన చేసిన సేవలకు అనేక సంస్థలు అవార్డులు కూడా ఇచ్చాయన్నారు, అతని ధైర్యం, మేధో ధైర్యం, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా నిలదొక్కుకున్న తీరు పదిమందికి ఆదర్శం అన్నారు. డాక్టర్ జయ గోపాల్ చిన్నతనంలోనే అనేక మత గ్రంథాలను విశ్లేషించిన మేధావి అని, పెరియార్ ఈవి రామసామి, అంబేద్కర్, రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ వంటి ప్రముఖులు ఆయనకు ఆదర్శమని, వారు కొనసాగించిన సామాజిక పోరాటం, ప్రతిపాదించిన న్యాయ సిద్ధాంతాలు సమాజంలో ఉన్న అన్యాయాలకు కులం, మతం అంటరానితనాలకి వ్యతిరేకంగా నిలబడే మార్గ దర్శకత్వాన్ని జయగోపాల్ కు కడవరకు అందించాయన్నారు. ఈ వర్ధంతిసభకు ముఖ్య అతిథులుగా రైటర్స్ అకాడమీ చైర్మన్, ఉత్తరాంధ్ర సంస్థ కన్వీనర్, లీడర్ దినపత్రిక ఎడిటర్ రమణమూర్తి, ప్రముఖ విప్లవ కవి కుమారుడు ఉదయ్ భాస్కర్ హాజరవుతారని వక్తలుగా భారత నాస్తిక సమాజం నాయకులు సాయిని నరేందర్, టి.శ్రీరామ్మూర్తి, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ నాయకులు వేదాంత మౌర్య , ఇతర ప్రజాసంఘాల నాయకులు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా జయ గోపాల్ మీద రాసిన పాటను విడుదల చేయనున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్ రాజా, సంతోష్, సునీత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
