మన్యం ధీరుడు చిత్రం మరుపురాని జ్ఞాపకం – నేటి నుండి అమెజాన్ ప్రయమ్ ఓ టి టి లో ప్రదర్శన..
- చిత్రం విజయోత్సవ సంబరాల్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
- మన్యం ధీరుడు చిత్రం వీక్షించడం మరుపురాని జ్ఞాపకం అని, చరిత్ర తెలుసుకునేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. 2024లో విడుదలైన ఆర్వీవీ మూవీస్ బ్యానర్పై ఆర్వీవీ సత్యనారాయణ నిర్మించిన మన్యం ధీరుడు సినిమాకు నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు. ఆర్వీవీ సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలైంది. ఇప్పటికే అన్ని థియేటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలో డాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విజయోత్సవ సంబరాలు చిత్ర యూనిట్ ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందుగా జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి గంటా మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలోని పాండ్రంగిలో జన్మించిన అల్లూరి సీతారామరాజు జీవితాన్ని చిత్రంగా నిర్మించడం హర్షణీయమన్నారు. సినీ హబ్ గా విశాఖను మారుస్తామని దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ విషయం చెప్పడం జరిగిందని దానిపై ప్రణాళికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు చేశామని, గత ప్రభుత్వము దీనిని నిర్వీర్యం చేసిందని అన్నారు. కళాకారులకు సాంస్కృతి కార్యక్రమాలు చేసుకునేందుకు వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు రవీంద్ర భారతి తరహాలో ఓ సభాస్థలని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా గత ప్రభుత్వ నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ఏమి చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని, అయితే దానిపై ఇప్పటికే ఒక కమిటీ ముఖ్య మంత్రి వేశారని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో రుషికొండ వద్ద ఉన్న ఫిలిం క్లబ్ నిర్వీర్యం చేశారని, ఈ నేపథ్యంలో కొత్త కమిటీని కూడా త్వరలో వేస్తున్నామని తెలిపారు. కళాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునే వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నేటి నుండి ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రయమ్ లో ప్రదర్శన ఉంటుంది అని అందరు థియేటర్లు చూడనివారు ఓటిటి లో చూడాలని కోరారు.
- అనంతరం నిర్మాత హీరో ఆర్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ అల్లూరి నిజమైన చరిత్రను ఈ సినిమాలో ఆవిష్కరించామన్నారు. ఈ సినిమా కోసం కత్తి యుద్ధం, విలువిద్యలో శిక్షణ తీసుకున్నామని తెలిపారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అల్లూరి చేసిన వీరోచిత పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు. పాడేరు, హిమాచల్ప్రదేశ్, కశ్మీర్ వంటి ప్రదేశాలలో చిత్రీకరణ జరిపాం అన్నారు. చిత్రానికి సంగీతం పవన్కుమార్ ఇచ్చారన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి, సెంచరీ యూనివర్సిటీ వీసీ జీఎస్ఎన్ రాజు, ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ అధినేత నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, చిత్రం యూనిట్ సభ్యులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.
- మన్యం ధీరుడు ట్రెండ్ సృష్టించింది-రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి
- రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి రమణమూర్తి మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మించినప్పటి నుంచి థియేటర్లో విడుదలైన వరకు ఎంత సంపాదించిందో తెలియదు కాని ప్రపంచవ్యాప్తంగా ట్రెండును సృష్టించిందన్నారు. ఆర్వీవీ మూవీస్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘మన్యం ధీరుడు’ స్వీయ నిర్మాణంలో ఆర్వీవీ సత్యనారాయణ నటిస్తూ నిర్మించడం, నరేష్ డెక్కల దర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు. నేటి తరానికి అల్లూరి చరిత్ర తెలుసుకోవడానికి ఈ చిత్రం దోహదం చేస్తుందని తెలిపారు.