సుమారు 3 వేల మంది నేరుగా వీక్షించేలా ఏర్పాట్లు – వివరాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కరించుకొని ఈనెల 30 ఆదివారం తణుకులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తణుకులోని నరేంద్ర సెంటర్, జూబ్లీ బ్రిడ్జి వద్ద నూలి గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుందన్నారు. కుటుంబ సపరివార సమేతంగా సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి కళ్యాణం తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. కల్యాణం పాసులు కోసం తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. సుమారు 3 వేల మంది వీక్షకులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.