ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కరిస్తాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ మహాసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూటికి నూరు శాతం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్
విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గురువారం విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ మహాసభలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తాము చేసిన పనికి ఏరోజు జీతమొస్తుందో తెలియని పరిస్థితి నుండి కూటమి ప్రభుత్వంలో ఒకటో తేదీనే జీతాలు అందించే పరిస్థితికి తీసుకువచ్చామన్నారు. ఉద్యోగస్తులు కోరుకున్నట్లుగా ప్రతి నెలా మొదటి తేదీనే జీతం అందేలా చట్టబద్ధమైన ప్రక్రియకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల సమస్యపై స్పష్టమైన కార్యాచరణ ఏర్పాటు చేసి అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు. ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిపాలనలో ఉద్యోగుల పాత్ర అమోఘం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించిన ఉద్యోగ సంఘ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే అరెస్ట్ ల భయం ఉండేదని గుర్తుచేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూటికి నూరు శాతం సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిట్టింగ్ జడ్జితో గానీ లేదా విశ్రాంత జడ్జితో గానీ సమస్యలపై అవగాహన తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తిన డిమాండ్ ను ఏకీభవిస్తున్నానన్నారు.ఉద్యోగులు, ప్రభుత్వం పరస్పర సహకారంతో పని చేసి పాలనను మరింత ప్రజామోదంగా తీర్చిదిద్దుదామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య సమస్యల సమన్వయం కోసం ఎన్టీఆర్ హయాంలో ట్రిబ్యూనల్ ఉండేదని, గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందన్నారు. ట్రిబ్యూనల్ ఏర్పాటు అంశంపై సీఎం చంద్రబాబునాయుడుతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల విషయంలో నిబద్ధతతో పనిచేస్తున్నారని వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ నాయకత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. ఉద్యోగుల సమస్యలపై సంఘ ప్రతినిధులు డిప్యూటీ సీఎంతో చర్చించేందుకు చొరవ తీసుకుంటానన్నారు. కార్యక్రమం అనంతరం ఉద్యోగ సంఘాలు మంత్రి కందుల దుర్గేష్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, అసోసియేషన్ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.