ఆంధ్రప్రదేశ్ లో ఉద్యాన పంటలలోని ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపుకి ఉన్న అవకాశాల దృష్ట్యా డా|| వై. యస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం చొరవ తీసుకొని “ఉద్యాన పంటల ఉత్పత్తులలో భౌగోళిక గుర్తింపు – విధానాలు, ప్రక్రియలు” అంశంపై అంతర్జాల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భౌగోళిక గుర్తింపు అప్లికేషన్ వంటి అంశాలలో నిష్ణాతులైన సుభజిత్ సాహ, హెడ్ లీగల్ మరియు ఐ.పీ.ఆర్., రెసెల్యూట్4 IP, గ్రూప్ వారు అవగాహన కల్పించారు
ఈ సదస్సులో డా|| గోపాల్, ఉపకులపతి, డా.వై.యస్.ఆర్.హెచ్.యూ. మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన పంటలకు హబ్ గా ప్రసిద్ధి చెందింది. భౌగోళిక గుర్తింపుకి అనువైన సాంప్రదాయ పంటల ఉత్పత్తులు చాలా ఉన్నాయి. అవి దుర్గాడ మిరప, అరటి సుగందాలు, పోలూరు వంకాయ, కాకినాడ రోజ్, నూజివీడు చిన్నరసాలు, పండూరి వారి మామిడి, బాపట్ల వంకాయి మరియు మైదుకూరు పసుపు వంటి అన్నిటికీ భౌగోళిక గుర్తింపు సాధించడానికి ప్రయత్నంలో భాగంగా ఈ సదస్సు నిర్వహించి శాస్త్రవేత్తలకు మరియు జిల్లా ఉద్యాన అధికారులకు అవగాహన కల్పించడం వలన భౌగోళిక గుర్తింపు సాధించడం సులభతరం చేయడం జరుగుతుంది. ఇతర సాంప్రదాయ ఉద్యాన ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు సాధించడం కోసం ఉన్న అవకాశాలను పరిశీలించాలని నిర్దేశించారు.
డా|| ఎమ్. మాధవి, పరిశోధన సంచాలకులు మాట్లాడుతూ సాంప్రదాయ పంటలకు చెందిన ఉత్పత్తులు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలలో పండించడం వలన మంచి నాణ్యత మరియు దిగుబడి సాధించవచ్చు. కావున అలాంటి పంటల ఉత్పత్తులకు భౌగోళి గుర్తింపు సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ సహకారం తీసుకొని ఆ పంటలకు సంబంధించిన చరిత్ర అంశాలు వంటివి సంగ్రహించడంలో శాస్త్రవేత్తలు మరియు ఉద్యాన శాఖవారు సమన్వయ పరచుకోవాలని నిర్దేశించారు.
శ్రీ. సుభిజిత్ సాహ మాట్లాడుతూ భౌగోళిక గుర్తింపు అప్లికేషన్ పద్ధతులు, లోగో తయారి మరియు సాంకేతికత అవసరాలపై అవగాహన కల్పించారు
ఈ అవగాహన సదస్సులో ఉద్యాన విద్యాలయం రిజిస్టార్, డా|| బి. శ్రీనివాసులు, డీన్ ఆఫ్ హార్టికల్చర్, డా|| ఎల్. నారంనాయుడు, డీన్ ఆఫ్ పి. జి. స్టడీస్, డా|| కె. టి. వి. రమణ, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్స్, డా|| ఎస్. సూర్యకుమారి, సి.ఓ.ఈ. డా|| బి. ప్రసన్న కుమార్, ఉద్యాన విస్తరణ సంచాలకులు డా|| బి. గోవిందరాజులు , డి.ఐ.ఐ.పి. డా|| కె. ధనుంజయ, యూనివర్సిటీ లైబ్రేరియన్ డా|| జి. రామానందం మరియు శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అధ్యాపకులు మరియు జిల్లా ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.
