ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.శుక్రవారం తాడేపల్లిగూడెం 29 వ వార్డులో పేదలకు ఇళ్ళ స్థలాలు దరఖాస్తులు పంపిణీ చేసి దరఖాస్తులు పూర్తి చేయించడం జరిగింది.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ళు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు కేటాయిస్తామన్న వాగ్దానం అమలు చేయాలని కోరారు.అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న నివేశనా స్థలాల లబ్ధిదారులకు పట్టణాల్లో సెంటుకు బదులుగా 2 సెంట్లు, గ్రామాల్లో సెంటున్నరకు బదులు 3 సెంట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెరవేర్చాలని కోరారు. అలాగే గృహ నిర్మాణానికి 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాం ప్రసాద్,సికిలే పుష్పకుమారి, తాడేపల్లిగూడెం సీపీఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సీపీఐ నాయకులు తూము సత్యనారాయణ, వడ్డాది మేరీ, నిమ్మకాయలు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
