ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఇళ్లులేని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని 24వ వార్డు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి, ఇళ్ల స్థలాలకు ఆర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ళు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు కేటాయిస్తామన్న వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న నివేశనా స్థలాల లబ్ధిదారులకు పట్టణాల్లో సెంటుకు బదులుగా రెండు సెంట్లు,గ్రామాల్లో సెంటున్నరకు బదులు మూడు సెంట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెరవేర్చాలని కోరారు.అలాగే గృహ నిర్మాణానికి 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జగన్ సెంటు ఇచ్చి కేంద్రం ఇచ్చిన లక్షా ఎనబై వేలను తానే ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నాడని ఇచ్చిన స్ధలాలు కూడా ముంపు ప్రాంతంలో ఇచ్చాడని 32 లక్షల ఇళ్లు నిర్మిస్తానని గాలికొదిలేశాడని విమర్శించారు. జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాల భూ సేకరణలో వైకాపా కోట్లల్లో దిగమింగిందని ముప్పాళ్ల దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ నెల 10న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని, వచ్చే నెలలో కలెక్టరేట్ ల వద్ద ధర్నాలు చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాక పోతే ఇళ్ల స్థలాల సాధన సమితి ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో బ్రతుకుతున్న పేదలు అద్దెలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సత్వరమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు కోరుతూ దశలవారీ ఆందోళనలు చేపడతామని కోనాల హెచ్చరించారు.
కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాం ప్రసాద్,సికిలే పుష్పకుమారి,పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు,మండల కార్యదర్శి యు.జయకృష్ణ,దాస్యం రాము తదితరులు ఆధ్వర్యం వహించారు. అధిక సంఖ్యలో ఇళ్ళ స్థలాలు లబ్ధిదారులు పాల్గొన్నారు
