పూర్ణా మార్కెట్లో చిరు వ్యాపారస్తుల యొక్క సమస్యల పట్ల ఆరా తీసిన ఎమ్మెల్యే వంశీ
పూర్ణా మార్కెట్ నుంచి రామకృష్ణ జంక్షన్ వరకు పాదయాత్రగా వెళ్లి, వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి, ప్రజాభీష్టం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ
దక్షిణ నియోజకవర్గం లో పూర్ణా మార్కెట్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్థానిక చిరు వ్యాపారస్తులను స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి యొక్క సమస్యలు పట్ల ఆరా తీశారు. చిరు వ్యాపారస్తుల యొక్క సమస్యలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడంతో పాటు జరుగుతున్న పరిణామలపై వారితో చర్చించారు. ప్రభుత్వ అధికారులు సమూలంగా దుకాణాలను ఖాళీ చేయడం పట్ల సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ సిబ్బంది చేపట్టిన చర్యలు పట్ల ఎమ్మెల్యే వంశీ వివరణ కోరారు. అధిక ఆశీలు వసూళ్లు, పలువురు గుత్తాధిపత్యం చేస్తున్న అంశాలు ఎమ్మెల్యే దృష్టికి పలువురు వివరించారు. కొంతమంది చేతుల్లో అనేక షాపులు కేంద్రీకృతం కావడం వంటి అనేక అంశాలను ఎమ్మెల్యే కి స్థానిక వర్తకులు వివరించారు. పూర్ణ మార్కెట్ నుంచి రామకృష్ణ జంక్షన్ వరకు పాదయాత్రగా వెళ్లి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరిస్తానని, వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకం కలగాకుండా, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై, తమపై ఉందని అన్నారు. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.