సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు
ఇళ్ళు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం హామీ ఎలాంటి కాలయాపన లేకుండా త్వరితగతిన నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సీపీఐ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం వేల్పూరు గ్రామంలో కనకదుర్గమ్మ గుడి వద్ద లబ్ధిదారులచే ఇళ్ళ స్థలాల అర్జీలు పూరించారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ గూడు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల నెరవేరుస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ అమలుకు పూనుకోవాలన్నారు.స్వంత గృహాలు లేని నిరుపేదలు అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని తక్షణమే పేదల ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న హామీ నెరవేర్చాలని భీమారావు డిమాండ్ చేశారు.
ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి,రాష్ట్ర సమితి సభ్యురాలు వై. నాగలక్ష్మి, ఎన్. రామశ్రీను, జక్కంపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.