భీమవరంలో బి.ఆర్.అంబేద్కర్ సాంస్కృతిక భవనం నందు కృపా నివాస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మహిళాదినోత్సవం ఘనంగా నిర్వహించినారు. ఈ ఆర్గనైజేషన్ సభ్యులు జి.సత్య సుధామ, ఎమ్. జ్యోతిల ఆధ్వర్యంలో జరిగినది.
రేపుమహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ రంగాలలో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే మహిళలకు వారి వారి ప్రతిభను గుర్తించి అవార్డులు అందచేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో వావిలాల సరళాదేవికి సావిత్రిబాయిపూలే అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సరళాదేవి ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదములు తెలియపరుస్తూ మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న ఈ విషపూరితమైన రోజులు పోవాలి అంటే ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ సకాలంలో నిందితులకు శిక్షవిధించి, మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గి మహిళాదినోత్సవం ఆనందంగా జరుపుకునే రోజులు రావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు, మహిళా నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.