‘సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం–పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం’ థీమ్ కొనసాగిస్తాం
తణుకులో పగడ్భంధీగా ప్లాస్టిక్ నిషేధం అమలు – తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
ఈనెల 15న తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న ‘స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర’ కార్యక్రమానికి కొనసాగింపుగా తణుకులో నిర్వహిస్తున్న థీమ్లో భాగంగా ‘సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం–పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం’ దశలవారీగా అమలు చేస్తామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యంగా 100 మైక్రాన్లు మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ 19 వస్తువులను మానేయాలని దీనిద్వారా పర్యావరణాన్ని కాపాడగలిగినవారమవుతామని చెప్పారు. గురువారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాబోయే రోజుల్లో తణుకులో ప్లాస్టిక్ నిషేధించడంతోపాటు దుకాణాలు, వ్యాపారులు వినియోగించే ప్లాస్టిక్ సంచుల స్థానంలో బయోడీగ్రేడబుల్ సంచులు వినియోగించే విధంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. తణుకులో ప్లాస్టిక్ నిషేధానికి అత్యం ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి మారుపేరుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల్లో, పరిశ్రమల్లో ఇలా ప్రతి చోట పరిశుభద్రత, పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకు అతధిక ప్రాధాన్యతఇచ్చి ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణాన్ని కాపాడుతూ స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పట్టణాలుగా ఉండాలనేది ముఖ్య సంకల్పం అన్నారు. ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన స్వచ్ఛభారత్ పిలుపులో భాగంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరు బాధ్యతగా తీసుకుని భాగాస్వామ్యం చేయాలని కోరారు. ఈనెల 15న తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజావేదిక అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సవేశం అనంతరం జిల్లాస్థాయి అధికారులో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ తణుకు చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యంగా పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయిదేళ్లలో కనీసం డ్రైనేజీల్లో సిల్టు తీయని పరిస్థితి ఉందన్నారు. అయితే గత కొద్ది నెలలుగా డ్రైనేజీల్లో సిల్టు తీసే పనిని చేపట్టామన్నారు.