స్వచ్చాంధ్ర లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రూ. 10 లక్షల కోట్ల అప్పుభారం ప్రజలపై మోపారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రజల సహకారంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఇది ప్రజా ప్రభుత్వం :
1978, మార్చి 15వ తేదీ 45 ఏళ్ల క్రితం ఇదే రోజు నేను మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని అసాధారణ గౌరవం నాకు దక్కింది. తెలుగు ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. పాలనలో సంస్కరణలు తెస్తున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికను ప్రజలు ఆశీర్వదించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చాం. గత పాలకులు ఏనాడైనా ప్రజల్లో తిరిగారా ? పరదాలు కట్టుకుని తిరిగారు. గాల్లో వస్తుంటే నేలపై చెట్లు నరికించారు. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేకుండా చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేసి రూ. 10 కోట్ల అప్పులు ప్రజలపై మోపారు. అసలు , వడ్డీ కడుతున్నాం. గత పాలకులు చెత్తపైనా పన్ను వేశారు. మీ పట్టాదారు పుస్తకాలపై వారి బొమ్మలు వేశారు. రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల భూములు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రైవేటు భూములు 22 ఏ కింద పెట్టేశారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేస్తున్నారు. స్థిరమైన ప్రభుత్వంతోనే సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మన దేశంలో ఒక్క పెన్షన్ల కిందే ప్రతి నెలా 64 లక్షల మందికి ఏడాదికి రూ. 33 వేల కోట్లు వెచ్చిస్తోంది ఏపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో ముక్కుతూ మూలుగుతూ పింఛన్లు ఇచ్చారు. రూ. 200 పింఛన్ని రూ. 2 వేలు చేసింది నేనే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 3,000 పింఛను రూ.4000 వేలు చేశాను. డయాలసిస్ రోగులకు రూ. 10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు పింఛను ఇస్తూ మానవత్వాన్ని నిరూపించుకున్నాం. ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నాం. మే నెల నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికి తల్లికి వందనం అందిస్తున్నాం. ప్రజలు పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నాం. రైతు భరోసా కింద రూ. 20 వేలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నాం. గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా గుంతలే. నూటికి 85 శాతం రోడ్లలో గుంతలు లేకుండా చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే. గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేను చేసిన పనుల వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ నుంచి వస్తోంది. గత ఐదేళ్లూ అభివృద్ధి అన్న మాట లేకపోవడంతో దక్షణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఏపీ నిలిచింది.