స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరిన మంత్రి దుర్గేష్
స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వామ్యులైతే సత్వర ఫలితాలు వస్తాయన్న మంత్రి దుర్గేష్
స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛ ఆంధ్రా బాటలు వేస్తుందన్న మంత్రి దుర్గేష్
ప్రతి గ్రామం స్వచ్ఛతతో ఫరిఢవిల్లాలని సూచించిన మంత్రి దుర్గేష్
ప్రతి గ్రామం స్వచ్ఛతతో ఫరిఢవిల్లాలని,స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛ ఆంధ్రా బాసటగా నిలవాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. శనివారం నిడదవోలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని చీపురు చేత పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం పట్టణంలోని సంత మార్కెట్ వరకు మంత్రి దుర్గేష్ ర్యాలీగా వెళ్లారు. పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేకించి మాట్లాడారు. వారి కష్టాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా స్వచ్ఛ నిడదవోలుకు అడుగులు వేద్దామని నినదించారు.
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం నందు మున్సిపల్ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన ప్రతినెల మూడో శనివారం జరుగు స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని సంతమార్కెట్ వరకు ర్యాలీగా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమీషనర్, వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నెలలో ప్రతీ మూడో శనివారం స్వచ్ఛాంద్ర – స్వచ్చత దినోత్సవంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా స్వచ్ఛాంధ్ర దివస్ నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని పరిసరాలను బాగుచేసుకోవాలన్న ఉద్దేశంతో, సమాజం మొత్తం ప్లాస్టిక్ రహితంగా కావాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం,ప్రతి నగరం ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తయారుచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కాలుష్యానికి దూరంగా పరిశుభ్రతకు పెద్దపీట వేసి మన ప్రాంతాలను బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా మార్పు తీసుకువచ్చి లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ప్లాస్టిక్ వినియోగం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసే విషయంలో ప్రభుత్వం సూచించిన విధానాలను పాటించాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్నిప్రాంతాల్లో ర్యాలీలు, మానవహారాలు, ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అన్నివర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై పరిశుభ్రమైన, స్వచ్ఛ ప్రాంతాలుగా తమ ప్రాంతాలను రూపొందించుకోవాలన్నారు. తమ చిన్నతనంలో ప్లాస్టిక్ ను వినియోగించేవాళ్లం కాదని గుర్తుచేశారు.కాల క్రమంలో జీవితాన్ని సుఖమయం చేసుకునే భాగంలో దుఖఃమయం చేసుకుంటున్నామని వివరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ముందుగా ఎవరికి వారు చైతన్యం అవ్వాలని సూచించారు.