డంపింగ్ యార్డ్ కు అవసరమైన ప్రత్యేక స్థలం కేటాయించాలని సిపిఎం వేల్పూరు గ్రామకమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సిపిఎం గ్రామకమిటీ ఆధ్వర్యంలో తణుకు డిప్యూటీ తహసిల్దార్ ఎన్. శ్రీదేవి కి సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందించినారు. ఈ సందర్భంగా సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు మాట్లాడుతూ మండలంలో అతిపెద్ద జనాభా కలిగిన వేల్పూరు గ్రామం దినదిన అభివృద్ధి చెందుతూ మరింత విస్తరిస్తున్నదని ఆయన అన్నారు. అటువంటి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పోగేసిన చెత్తని వేసేందుకు అవసరమైన ప్రత్యేక స్థలం లేక సంబంధిత అధికారులు గ్రామ సరిహద్దులో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గోస్తని కాలువ గట్టుపై గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్తని తరలించి డంపింగ్ చేస్తున్నారని, దీంతో వర్షాకాలంలో చెత్త తడిసి తీవ్ర దుర్గంధం వస్తుందని ఆయన వివరించారు. డంపింగ్ చేసిన చెత్తకు నిప్పు అంటించి కాల్చేస్తున్నారని దీనివలన విపరీతంగా దుర్వాసన, పొగతో ఆ రహదారి మొత్తం కమ్మేయడం వలన ఆ సమీపంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారులు చేసుకొనే జీవిస్తున్న వారితోపాటు ఆ రహదారిలో ప్రయాణించే వాహనదారులు కంటి, ఊపిరితిత్తులు శ్వాసకోస సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వాలు ఇస్తున్న సంపూర్ణ పారిశుధ్యం, స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర వంటి నినాదాలు కేవలం ప్రసార ఆర్భాటాలకే పరిమితం అవుతున్నాయి తప్ప అంతగా ఫలితాలు కనిపించడం లేదని వీరభద్రరావు పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తక్షణం స్పందించి చిత్తశుద్ధితో కృషి చేసి డంపింగ్ యార్డ్ కు స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరరావు, అంబటి రామకృష్ణ, కుడకా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
