ఏపీలో రెండు బుద్ధిస్ట్ సర్క్యూట్ ల ఏర్పాటుకు కేంద్రం అనుకూలం
ఘంటసాల బుద్ధ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
బుద్ధుని విధానాలు అనుసరణీయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
బుద్ధ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్రస్థాయి కార్యక్రమంగా నిర్వహించడం గొప్ప విషయమని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఘనంగా బౌద్ధ జయంతి వేడుకలు
ఘంటసాల: ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ క్షేత్రాల్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం కృష్ణా జిల్లా ఘంటసాలలో రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో జరిగిన బౌద్ధ జయంతి వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘంటసాల గ్రామంలోని బౌద్ధస్తూపం ప్రాంగణంలో బౌద్ధ సాహితీ – చారిత్రక సదస్సులు మొదలుకొని వివిధ కార్యక్రమాలతో పాటు శయన బుద్ధ ప్రాజెక్టు ఆవరణలో భారీ సాంస్కృతిక ర్యాలీ, బౌద్ధ స్థూపం వద్ద సభ జరిగిన సభల్లో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకాలీన సమాజానికి మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బుద్ధుని జీవిత గొప్పతనాన్ని మంత్రి దుర్గేష్ వివరించారు. వేల సంవత్సరాల తర్వాత కూడా బుద్ధుడు బోధించిన శాంతి, సహనం, అహింస, శాంతియుత సహజీవనం వంటి అంశాలు నేటికీ దిక్సూచిగా నిలవడం అసాధారణమైన విషయం అన్నారు. బుద్ధుడి జీవితం ఓ పాఠం అన్నారు. ఆయన జీవితమే సందేశం అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రాచీన బౌద్ధ క్షేత్రంగా పరిఢవిల్లిన ఘంటసాలలో బుద్ధ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర పర్యాటక శాఖ దేశంలో బౌద్ధ సర్క్యూట్ ల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో విశాఖ మొదలుకొని అమరావతి వరకు బౌద్ధారామాలు, బుద్ధుడి ఆనవాళ్లు కలిగిన ప్రాంతాలను కలిపి బుద్ధిస్ట్ సర్క్యూట్ గా చేసేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు.ఇప్పటికే ఈ విషయమై న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిశానని ఈ క్రమంలో బుద్ధుని ఆనవాళ్లు కలిగిన దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి ఏపీకి రెండు బుద్ధిస్ట్ సర్క్యూట్ లు కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ నేపథ్యంలో బౌద్ధం ప్రచారంలోకి వచ్చిన విశాఖపట్నంలోని తొట్ల కొండ, బావి కొండ ప్రాంతాలను, బుద్దుని సందేశాన్ని ముందుకు తీసుకెళ్లిన అమరావతి సమీపంలోని ఘంటసాల, భట్టిప్రోలు లు ప్రాంతాలను సర్క్యూట్ లు అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ఇప్పటికే సంబంధింత సర్క్యూట్ లపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ విజ్ఞప్తి మేరకు ఘంటసాల సమీపంలోని పలు పర్యాటక ప్రాంతాలను కలిపి విస్తృతమైన సర్క్యూట్ ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
సత్యాన్వేషణ కోసం సంచరించి బోధి వృక్షం క్రింద మహా ధ్యానం చేసి జ్ఞానం పొందిన మహా వ్యక్తి గౌతమ బుద్ధుని జన్మ జ్ఞాపకార్థం నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిన ఘంటసాలలో బుద్ధ పౌర్ణమి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్రస్థాయి కార్యక్రమంగా ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబునాయుడు, ఉ పముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ధన్యవాదాలు తెలిపారు. క్రీ.పూ రెండు మూడు శతాబ్దాల స్థూపం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశానికి చెందిన మనమంతా శాంతికి అనుకూలమన్నారు. శాంతి వచనాలు అమలు చేసే దృక్పథం ఉన్న జాతి భారత జాతి అని తెలిపారు. ప్రత్యర్థులకు ఏ రకమైన సమాధానం చెప్పాలో ఇప్పటికే నిరూపించామని, అవసరమైతే మళ్లీ చెబుతామని పరోక్షంగా పాకిస్థాన్ అంశాన్ని ఉదహరించారు. బుద్ధుని జీవిత ప్రస్థానంతో పాటుగా బుద్దుని అహింస విధానాన్ని అవలంభించి దేశంలో, ఇతర దేశాల్లో బుద్ధుని విధానాలు, చరిత్రను ప్రస్ఫుటంగా ప్రపంచానికి నేటికీ అందుబాటులోకి ఉందంటే అందుకు కారణమైన అశోక చక్రవర్తి త్యాగాన్ని గుర్తుచేశారు.ఆయన సందేశాన్ని ఆచరించే విధంగా చేసినందుకు స్మరించుకున్నారు. ఎంతో మంది బౌద్ధ మతాన్ని స్వీకరించి ధర్మాన్ని పాటిస్తున్నారన్నారని తెలిపారు.రాష్ట్రంలో కళా సాంస్కృతిక వైభవానికి అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్ శ్రమిస్తున్నారని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు.
కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, రాజ్యసభ మాజీ సభ్యులు రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, అధికారులు, కూటమి నాయకులు, బౌద్ధ బిక్షువులు తదితరులు పాల్గొన్నారు..