నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అయిదుగురు అరెస్టు

నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అయిదుగురు వ్యక్తులను మంగళవారం తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణ ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద సీడీఎం మెషీన్‌లో జమ చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉంది. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయమూర్తి, పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన జుత్తిగ నాగరాజు, యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన దిగుమర్తి ఏసు, బీమవరం మండలం యల్లమెల్లిపురం గ్రామానికి చెందిన తోట రామచంద్రరావు, తణుకు ఎన్జీవో కాలనీకు చెందిన పినిశెట్టి చక్రధర్‌లను అరెస్టు చేసి వారి వద్ద రూ. 1,67,600 విలువైన రూ. 200 నోట్లు 838 స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనా«ద్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తణుకు పట్టణంలోని ఎన్జీవో కాలనీకు చెందిన పినిశెట్టి చక్రధర్‌ గత నెల 15న స్థానిక ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద సీడీఎం ద్వారా తన ఖాతాలోకి రూ. 200 నోట్లు మొత్తం రూ. 16,600 నగదును జమ చేశాడు. అయితే నగదు జమ కాకపోడంతో అదే నెల 21న బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజున బ్రాంచ్‌ మేనేజర్‌ విరోతి సోమశేఖర్‌తో కలిసి సిబ్బంది సీడీఎం మెషీన్‌ తెరచి చూడగా జమ చేసేందుకు ప్రయత్నించి 83 నోట్లు జమ కాకపోగా అక్కడే ఇరుక్కున్నాయి. దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా నకిలీ కరెన్సీ అని తేలడంతో తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు పట్టణ సీఐ ఎన్‌.కొండయ్య ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై కె.ప్రసాద్‌ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయులు గత 30 ఏళ్లుగా నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 కేసుల్లో ముద్దాయిగా గుర్తించి అతని వద్ద నుంచి మిగిలినవారికి సరఫరా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆంజనేయులు తనకు బృందంగా ఏర్పాటు చేసుకున్న జుత్తిగ నాగరాజు, దిగుమర్తి ఏసు, తోట రామచంద్రరావు, పినిశెట్టి చక్రధర్‌లతో నకిలీ కరెన్సీ చలామణి చేయిస్తున్నట్లుగా నిర్థారించారు. వీరితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉండగా వీరు వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు డీఎస్పీ విశ్వనాద్‌ వివరించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయడానికి సహకరించిన తణుకు పట్టణ సీఐ ఎన్‌.కొండయ్య, పట్టణ ఎస్సై కె.ప్రసాద్, ఏఎస్సై బి.పోలయ్యకాపు, హేడ్ కానిస్టేబుల్‌ ఎంవీవీ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు ఎన్‌.అప్పారావు, షేక్‌ అక్బర్‌లాల్, డి.వెలగేశ్వరరావు, ఎం.శివాజీ, టి.రవి, జి.మోహనమురళీకృష్ణలను అభినందించారు. వీరికి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీంఅస్మీ రివార్డులు అందజేసిట్లు చెప్పారు. ఈ సమావేశంలో ట్రైనీ డీఎస్పీ కె.మానస హాజరయ్యారు.

Scroll to Top
Share via
Copy link