** ఉండ్రాజవరం మండలం పసలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
** గడప గడపకు వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లు అందించి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించిన మంత్రి దుర్గేష్
** ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
** అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్
** సకాలంలో పెన్షన్ పంపిణీ చేయడంతో సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు..ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
** నిడదవోలు నియోజకవర్గ ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలకు ఆంగ్ల నూతన సంవత్సర , సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన..మంత్రి దుర్గేష్
ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేద ప్రజల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
మంగళవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి గ్రామంలో ఇంటింటికి, గడప గడపకు వెళ్లి మంత్రి కందుల దుర్గేష్ వృద్ధులు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వయంగా సామాజిక భద్రతా పెన్షన్లు అందించారు. అంతేగాక ఒక్కొక్కరినీ ఆత్మీయంగా పలకరించి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్న భరోసానిచ్చారు. సకాలంలో పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలకు మంత్రి దుర్గేష్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో అందరి జీవితాల్లో సంతోషం నిండాలని, సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో కాంతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆర్థికభారాన్ని సైతం లెక్కచేయకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ను రూ.3,000 నుండి రూ.4,000కు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ను రూ.3,000 నుండి రూ.6,000కు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15,000 పెన్షన్ ఇస్తుందన్నారు. 1వ తేదీ ఆదివారం, సెలవు దినం అయితే అంతకు ముందు రోజే పెన్షన్ లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ప్రస్తుతం జనవరి 1వ తేదీన ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ముందు రోజే పంపిణీ చేయాలని సీఎం సూచించిట్లు మంత్రి తెలిపారు. ప్రజల ఆలోచనలు తెలిసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రతీ విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తుండటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. తెల్లవారు ఝామునే తమకు పెన్షన్ అందించడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు పలువురు తనతో అన్నారని మంత్రి తెలిపారు.గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని మంత్రి దుర్గేష్ ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం విషయంలో వెనకడుగు వేయలేదని వివరించారు. ధాన్యం విషయంలో సైతం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామన్నారు. మహిళలను సంతోషపరిచేలా దీపం-2 పథకం క్రింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నారని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు. అంతకుముందు పసలపూడి గ్రామానికి వెళ్తూ మార్గమధ్యంలో వేలివెన్ను గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ గ్రామ పెద్దలను కలిసి ఆత్మీయంగా పలకరించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎం. సందీప్, ఇన్ చార్జ్ ఎమ్మార్వో ఎ. కనకదుర్గ, ఎంపీడీవో వి.వి రామారావు, కూటమి నేతలు బూరుగుపల్లి శ్రీనివాసరావు, బలుసు వెంకటరత్నం, సింహాద్రి రామకృష్ణ, కే. సోమేశ్వరరావు, గూన ధనరాజు, వీరమల్ల బాలాజీ, పెనుమత్స ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.