నాన్నకి ఇందనం ఇచ్చి, తల్లికి వందనం మరిచారని ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు ఇవ్వకుండా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇస్తామనడం మోసపూరితమైన చర్య అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ ఎస్ ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి ధ్వజమెత్తారు. ఈ మేరకు తణుకులో శుక్రవారం స్థానిక శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఏ ఐ ఎస్ ఏ. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి మాట్లాడుతూ నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరంలో అమలు చేస్తారని ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూశారని కానీ కూటమిప్రభుత్వం వారికి నిరాశ మిగిల్చిందని విమర్శించారు. ఈ పథకం అమలు చేస్తే విద్యార్థులకి ఇచ్చే 5 వేల రూపాయలతో సంబంధిత పాఠశాలలో ఫీజులు చెల్లించేందుకు ఉపయోగపడతాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించారని కానీ తీరా చూస్తే వచ్చే విద్యాసంవత్సరం నుండి తల్లికి వందనం పథకం అమలు చేస్తానని మొండిచేయ చూపారని ద్వజమెత్తారు, మద్యం మాత్రం తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో వుండేటట్లు చేశారని ఆ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసిందని ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పథకం అమలు చేసేవరకు విద్యార్థి సంఘాలుగా పోరు సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.పవన్, పి.అనీల్, ఆర్ మణి , కే ఎసురాజు, ఎస్.లక్కీచరణ్ తదితరులు పాల్గొన్నారు.
