అమరావతి: దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు వేదికైన దావోస్ లో పదుల సంఖ్యలో దిగ్గజ కంపెనీలు, యాజమాన్యాలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపై తమదైన వాణి వినిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి, ఆయన బృందం చేసిన ప్రయత్నాలు సఫలం అయినందుకు మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ బ్రాండ్ ను ప్రపంచానికి తెలిపేలా దావోస్ లో ముఖ్యమంత్రి అండ్ టీం చేసిన కృషి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. 4 రోజుల పాటు విరామం లేకుండా వరుస భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొని వివిధ రంగాలకు చెందిన వాణిజ్య సంస్థల ప్రతినిధులు, ప్రముఖ సంస్థల సీఈవోలు, పలు దేశాల ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించి రాష్ట్రానికి రావాలని ఆహ్వానం పలకడం సంతోషకరమన్నారు.
