తణుకు శ్రీ రామకృష్ణ సేవాసమితి భవనంలో సద్గురు త్యాగరాజ ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 24 నుండి జనవరి 29 వరకు నిర్వహించనున్న సద్గురు త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవములు తొలి రోజున ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తణుకులో 86 సంవత్సరాలుగా సద్గురు త్యాగరాజ ఆరాధన సంగీత మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందించదగిన విషయం అన్నారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో త్యాగరాజ కీర్తనలు ఉంటాయని, సంగీత ప్రియులకు ఎంతో మనో ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. 60 సంవత్సరాల క్రితం స్వర్గీయ ఇంగుర సీతారామయ్య ప్రారంభించిన సంగీత ఉత్సవాలను, గత 25 సంవత్సరాల నుండి స్త్రీలే నిర్వహించడం ఎంతో గర్వించదగిన విషయం అన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు మన జిల్లా తణుకు పట్టణం నందు నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి నేను ముఖ్యఅతిథిగా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి నాడు జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులను అర్పించడానికి విచ్చేస్తారని, ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారని తెలిపారు. సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ అధ్యక్షులు చిలుకూరి లక్ష్మీ సుజాత, సెక్రటరీ జీడిగుంట శర్వాణి, ట్రెజరర్ ఇందిరా, జాయింట్ సెక్రెటరీ బంక వసుంధర, సభ్యులు గమిడి సరోజ, పూర్వ అధ్యక్షులు మల్లెల భద్రమ్మ, కార్యదర్శి బమిడి కమలాదేవి, పట్టణ ప్రముఖులు వావిలాల సరళాదేవి, సంగీత ప్రియులు, తదితరులు పాల్గొన్నారు.
