విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ ఇచ్చామని, ఉచిత బస్సు తిరుగుతున్నాయని జాతీయ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాకా ఊదుతున్నారని ఆయన మాదిరిగానే ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తుందా అన్నట్లుగా ఎమ్మెల్యేలందరూ అబద్దాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో కూటమి బండారాన్ని ఉతికారేస్తున్నారని, బస్సులు మాఇంటికి వచ్చి ఎక్కించుకుంటున్నాయని, గ్యాస్ సిలిండర్లు బుక్ చేయకుండానే ఇంటికి ఉచితంగా వచ్చేస్తున్నాయని, రూ. 15వేలు మా ఇంట్లో అందరికీ అందేశాయని మీ ఘనకార్యాలను ప్రజలు గొప్పగా వెటకారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయని, మద్యం ఇంటికి సరఫరా చేసే పరిస్థితి నెలకొందని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్లైఓవర్స్ తణుకులో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని శంఖుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మూలనపడ్డాయని విమర్శించారు. 2019 నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రమ రేషన్ బియ్యం రవాణాపై ఉక్కుపాదం మోపి కట్టుదిట్టం చేశామని, సన్నబియ్యం అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మేలు చేశామని స్పష్టం చేశారు. మా హయాంలో విజిలెన్స్ దాడుల్లో పట్టుబడిన బియ్యాన్ని అదే నెలలో ఎక్కువ ధరలకు విక్రయాలు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చామని గుర్తు చేశారు. నేడు మరల రేషన్ బియ్యం అక్రమమార్గంలో తరలిస్తున్నారంటే అదంతా కూటమి ప్రభుత్వ దయేనని అన్నారు. రాష్ట్రంలో చెత్తకుప్పలు పేరుకున్న విషయాన్ని నేడు ఈనాడు పేపర్లోనే వస్తుండడం చూస్తున్నామని, చెత్త, మద్యం విక్రయాలపై ఎన్నికల హయాంలో తణుకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే టిక్టాక్లు చేశారని, రహదారుల విషయంలో సంక్రాంతి వచ్చేప్పటికీ అన్ని రహదారులు వేస్తామని భింకాలు పోయారని కానీ ప్యాచ్వర్కులతో సరిపెట్టారని దుయ్యబట్టారు.
