గత ప్రభుత్వ హయాంలో రూ. 750 కోట్లు కుంభకోణం
తణుకులో తాజాగా మరోసారి చలామణిలోకి వచ్చిన బాండ్లు – అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతోందని బదులిచ్చిన మంత్రి నారాయణ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తణుకు మున్సిపాల్టీ పరిధిలో జరిగిన టీడీఆర్ కుంభకోణం వ్యవహారంపై జరుగుతున్న విచారణ ఎంతవరకు వచ్చిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. తణుకు మున్సిపాల్టీలో రూ. 750 కోట్లు విలువైన 29 టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ఈ వ్యవహారంపై గత అసెంబ్లీ సమావేశాల్లో సైతం చర్చించినట్లు గుర్తు చేశారు. అయితే టీడీఆర్ బాండ్లు సీజ్ చేసి వారి చలామణీ నిలిపివేసినప్పటికీ తాజాగా వాటిని అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిసిందన్నారు. తణుకులో డంపింగ్ యార్డు పేరుతో సేకరించిన భూములకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ నుంచి వాల్యూ సర్టిఫికెట్ తీసుకోవాలని టౌన్ప్లానింగ్ అధికారులు కోరారని చెప్పారు. ఈ విలువ ఆధారంగా చదరపు గజానికి దాదాపు రూ. 33 వేలు విలువ చూపించడం జరిగిందన్నారు. గతంలో అవకతవకలకు పాల్పడిన వ్యక్తులకు మేలు జరిగేలా ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ మంత్రి దృష్టి సారించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏసీబీ విచారణ వేశామని అప్పట్లో మంత్రి ప్రకటించారని ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉందో తెలియజేయాలని కోరారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్లు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్నారు. తణుకు పురపాలక సంఘంలోనే రూ. 63.24 కోట్లు విలువైన టీడీఆర్ బాండ్లు రూ. 754.67 కోట్లు విలువకు మంజూరు చేశారని చెప్పారు. మున్సిపాల్టీకు శివారు ప్రాంతంలో ఇచ్చిన భూములకు సంబంధించి పట్టణంలోని నడిబొడ్డున ఉన్న ఇంటి అడ్రస్ ఇచ్చి విలువ పెంచి మరీ టీడీఆర్ బాండ్లు జారీ చేసినట్లు తేలిందన్నారు. ఇలాగే తణుకును ఆదర్శంగా తీసుకుని గత ప్రభుత్వహయాంలో పెద్దఎత్తున కుంభకోణాలు జరిగాయన్నారు. వీటిపై విజిలెన్స్ విచారణతోపాటు సీఐడీ విచారణ జరుగుతోందని బదులిచ్చారు.