మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కౌన్సిలర్ గా కూడా పనికిరాడు – జనసేన ఆవిర్భావ సభలో మంత్రి కందుల దుర్గేష్

సామాన్యుడి కోసం ఎంతవరకైనా తెగించే తత్వం పవన్ సొంతమని వెల్లడించిన మంత్రి దుర్గేష్

రాజకీయానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్

కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు, రూపకల్పనకు కారకులు పవన్ కళ్యాణ్

ప్రపంచ చరిత్రలోనే 100 శాతం స్ట్రైకింగ్ రేటు సాధించిన ఏకైక పార్టీ జనసేన

ఎత్తిన జెండాను దించకూడదన్న నిఖార్సైన వాదం, సమయస్ఫూర్తి, అంకితభావం, అలుపెరగని పోరాటాలు, సమయోచిత నిర్ణయాలు పవన్ లక్షణాలు

పీఎం నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ఏపీలో సువర్ణాధ్యాయం

పిఠాపురం: పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాలు ప్రారంభించి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక ఒరవడిని సృష్టించిన గొప్పనాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో అట్టహాసంగా నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ జయకేతనం సభలో మంత్రి దుర్గేష్ కీలకోపన్యాసం చేశారు. తన ప్రసంగంతో ఆద్యంతం సభికులను అలరించారు. పదునైన మాటలతో పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులను ఉత్తేజపరిచారు. జనసేన ప్రస్థానం, పవన్ కళ్యాణ్ ఎదిగిన తీరును స్పష్టంగా వివరించారు. అదే విధంగా గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవహార శైలి, గత ప్రభుత్వ నేతల తీరును ఘాటుగా ఎండగట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా తాను శాసన సభ్యుడిగా, మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండటానికి కారణం పవన్ కళ్యాణ్ వాత్సల్యమని ఈ ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజకీయాలనేవి నాయకుల అధికారం కోసం కావు సామాన్య ప్రజానీకాన్ని అందలం మీద కూర్చోబెట్టాలన్న ఆలోచనకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. 11 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా రాజకీయ పోరాటం చేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు, కూటమి రూపకల్పనకు కీలకమైన వ్యక్తిగా ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర ఏర్పరుచుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అభివర్ణించారు. రాజకీయానికి కొత్త నిర్వచనం చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు. తొలి నుండి అంకిత భావం ఉన్న వ్యక్తి, ఎత్తిన జెండాను దించకూడదన్న నిఖార్సైన వాదం, సమయోచిత నిర్ణయాలు,అలుపెరగని పోరాటాలు పవన్ ను రాష్ట్రస్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో గొప్ప రాజకీయ నాయకుడిగా నిలబెట్టిన లక్షణాలని వివరించారు. 11 ఏళ్ల పాటు నిర్విరామంగా సాగిన ప్రయాణం, ఏనాడూ వెన్ను చూపని వైనంతో కీలక అడుగులు వేసి ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డారన్నారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలిచిన సమయంలో తనతో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఓటమి అనేది తనను గంట మాత్రమే బాధపెట్టిందని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండాను నిలబెట్టాలన్నది తన లక్ష్యమన్నట్లు చెప్పి నేడు తన వెంట నడుస్తున్న జనసైనికులకు, ప్రజానీకానికి అండగా నిలిచారన్నారు. రాజకీయాల్లో 100 శాతం స్ట్రైకింగ్ రేట్, 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీలతో నిలబెట్టిన అన్ని చోట్లా గెలిచి ప్రపంచ రికార్డును సాధించారన్నారు. ప్రపంచ చరిత్రలో ఇదే రికార్డు.. ఈ తరహా మరే పార్టీకి లేదన్నారు.

అధికారంలోకి రాగానే విర్రవీగే ప్రభుత్వాలు చూశాం..నోటికొచ్చినట్లు మాట్లాడే దుర్మార్గులను చూశాం.. బూతులు తప్ప మరొకటి తెలియని నాయకులను చూశామని గత ప్రభుత్వ నేతల తీరును మంత్రి దుర్గేష్ ఎండగట్టారు.ఈ సందర్భంగా మాటలతో విర్రవీగుతున్న వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు..జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి కాకపోయి ఉంటే జగన్ కౌన్సిలర్ గా కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు.

నాడు ప్రతిపక్షంలో ఉన్నా, నేడు అధికారపక్షంలో ఉన్నా మాట మీరలేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను నిర్వర్తిస్తున్న కీలక పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ధి, అటవీ, గ్రామీణ నీటి సరఫరా శాఖల సత్ఫలితాలు ప్రజలకు చేరువ చేయాలని నిరంతరం తపన పడుతున్నారన్నారు.నేడు పవన్ కళ్యాణ్ అందించే దిశానిర్దేశంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విజయాలను తెలుపుతూ ప్రపంచంలోనే ఉక్కుమనిషిగా పేరొందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గ్రేట్ విజినరీగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పేదల కంట కన్నీరు రాకుండా చూసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లురాష్ట్రాన్ని సువర్ణాధ్యాయంగా మలచడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు, పార్లమెంట్,శాసన సభ, మండలి, కార్పొరేషన్ ఛైర్మన్ లు, డైరెక్టర్లు, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన జెండా రెపరెపలాడుతుండటానికి కారణమైన జనసైనికులు, వీర మహిళలు, ప్రవాసాంధ్రులకు మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link