రాజకీయ దురుద్దేశంతో వైసీపీ శ్రేణుల దుష్ప్రచారం
గతంలో రైతులను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
రూ. 1600 కోట్లు బకాయిలు చెల్లించిన ‘కూటమి’
తణుకులో 8,941 మంది రైతులకు రూ. 173 కోట్లు
రైతులకు 27 లక్షలకు పైగా గోనెసంచులు సరఫరా
అధైర్యపడవద్దని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ భరోసా
అకాల వర్షాలు కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉండి తణుకు నియోజకవర్గ రైతుల సమస్యలను పట్టించుకోకుండా రైతులను అవహేళన చేసి వారిని ఎర్రిపప్ప అని దుర్భాషలాడిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్ని విధాలుగా రైతులను విస్మరించి ఈ రోజు రాజకీయ లబ్థి కోసం రైతుల కోసం మాట్లాడ్డం విడ్డూరంగానూ, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది రైతులు అప్పటి ప్రభుత్వ విధానాలు కారణంగా ఆత్మహత్యలకు పాల్పడి బలవన్మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఆదుకుంటామని చెప్పి అయిదేళ్లలో దానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్నారు. రైతుల పట్ల వైసీపీకు ఏనాడు చిత్తశుద్ధి లేదని ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో అనేక అవకతవక విధానాలతో రైతులు ఎన్నో బ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే విధనాలను రద్దు చేసి వైసీపీ శ్రేణులు వారికి సంబంధించిన రైసుమిల్లులకే విక్రయించుకునే విధానంలో రేండమైజేషన్ విధానంతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. ధాన్యం విక్రయించిన రైతులకు ఆర్నెల్ల వరకు చెల్లింపులు చేయకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు రైతుల గురించి మాట్లాడ్డం సిగ్గు చేటన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలను అవగాహన చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రూ. 1600 కోట్లు ధాన్యం బకాయిలు ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించినట్లు చెప్పారు. ఖరీప్లో ధాన్యం విక్రయించిన రైతులకు బకాయిలు లేకుండా పూర్తిగా చెల్లించగా రబీ సీజన్కు సంబంధించి జిల్లాలోనే రైతుల «ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసి ఇంటికి వెళ్లే లోపు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో సుమారు 43 వేల ఎకరాల్లో 1,35,712 టన్నుల ధాన్యం సాగవుతోందని దీనిలో ఇప్పటి వరకు 84,802 టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి 8,941 మంది రైతులకు రూ. 173 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రైతులు అధైర్య పడ్డవద్దని రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. మరో 22 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. రైతులకు కావాల్సిన గోనెసంచులు కూడా వారికి అందించే వివధంగా అన్ని చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు తణుకు నియోజకవర్గంలో లక్ష్యానికి అనుగుణంగా దాదాపు 27 లక్షలకు పైగా గోనెసంచులు అందిచండం జరిగిందని రాబోయే రెండ్రోజుల్లో మరో 3 లక్షలు గోనె సంచులు అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, రైతులకు వారధిగా ఉండి రైతులకు రైసుమిల్లర్లు సహకరించాలని కోరారు. రైసుమిల్లర్లకు కూడా బ్యాంకు గ్యారెంటీ ఇబ్బందులు తలెత్తకుండా బకాయిలు చెల్లించి 1:2 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. మిల్లర్లు కూడా రైతులకు సహకారం అందించి క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ధాన్యం తడిచినప్పటికీ తేమ శాతం అంధింకంగా ఉన్నప్పటికీ రైసు మిల్లర్లు కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారి చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.