నూతన హంగులతో శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణం

నాడు అరాచకం నేడు అభివృద్ధి పథం

గుంటూరులో శంకర్ విలాస్ పై వంతెన (ఆర్వోబీ) శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

ప్రజల దశాబ్దాల అవసరాన్ని గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు

గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని అభినందించిన మంత్రి దుర్గేష్

దేశ సమైక్యత కోసం, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చిన మంత్రి దుర్గేష్

గుంటూరు : ఎన్నో సవాళ్లను అధిగమించి గుంటూరు నగరంలో నూతన హంగులతో రూపుదిద్దుకుంటోన్న శంకర్ విలాస్ పైవంతెన (ఆర్వోబీ) నిర్మాణం జిల్లా అభివృద్ధికి బాటలు వేయనుందని గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం గుంటూరు జిల్లాలోని శంకర్ విలాస్ పై వంతెన (ఆర్వోబి) శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని అభినందించారు. భవిష్యత్ అవసరాల మేరకు కొత్త ఆర్వోబీని నిర్మించాలన్న ప్రజల దశాబ్దాల అవసరాన్ని గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురుచూసిన బ్రిడ్జి నిర్మాణం చేయడం అసాధారణమైన విషయమన్నారు. చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జి మరెన్నో కాలాల పాటు ప్రజలకు సేవలందిస్తుందన్నారు. గుంటూరు జిల్లా ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చొరవతో గుంటూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరడం, ప్రస్తుతం తాను గుంటూరు ఇంచార్జి మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఇక్కడి ప్రజాప్రతినిధులు చూపిస్తున్న కృషిని మంత్రి దుర్గేష్ కొనియాడారు. తద్వారా జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జికి సహకరించిన బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బాధితుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా అవకాశం కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకత్వానికి, విజన్ లేని నాయకత్వానికి తేడాను ప్రజలు గమనించాలన్నారు. ప్రస్తుతం ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో కక్ష సాధింపుకే ప్రాధాన్యమిచ్చారు తప్ప అభివృద్ధికి స్థానం ఇవ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేలిందన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం సరైన దార్శనికతతో, 20,30 ఏళ్ల తర్వాత రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలన్న సూక్ష్మ ప్రణాళికతో, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలతో, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను సమ్మిళితం చేసి నడుస్తోందని వెల్లడించారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందిస్తున్న సహకారం గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశంలోనే నంబర్ 1 విజనరీగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకవైపు, పేదవారి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి ముందడుగు వేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోవైపు, ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరొందిన నరేంద్రమోదీ నాయకత్వం ఇంకోవైపు..వీళ్లందరి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజినీర్ సర్కార్ గా పయనిస్తోందని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు. దేశ సమైక్యత కోసం, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.

Scroll to Top
Share via
Copy link