తణుకులో శతజయంతి వేడుకలు – పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తొమ్మిది నెలలపాటు తల్లి గర్భంలో ఉండి అమ్మ సాన్నిహిత్యాన్ని పొందుకునే మధురానుభూతి ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఒక వ్యక్తి బిడ్డ స్థానం నుంచి ప్రయోజకుడిగా మారారంటే తల్లి ప్రేమకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. అందరినీ ప్రేమించు.. సమాజానికి నిరంతరం సేవలు అందించాలని సత్యసాయిబాబా చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలను ఆదివారం తణుకులో నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రిలో రోగులతోపాటు సహాయకులకు ఉచితంగా అన్నదానం చేయడానికి 2017లో సత్యసేవా సమితి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా దాదాపు 2 లక్షల మందికి అన్నదానం జరుగుతోందని చెప్పారు. సత్యసాయిబాబా ఆలోచనలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ దాతలు సైతం ముందుకు రావడం గర్వించదగిన విషయం అన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో సైతం తణుకును స్ఫూర్తిగా తీసుకుని అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలో దాదాపు 150 దేశాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ సత్యసాయిబాబా సేవా సంస్థ అన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రాయలసీమలో లక్షలాది మందికి తాగునీరు అందించి సత్యసాయిబాబా తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారని గుర్తు చేశారు. అనంతరం మహిళలకు కుట్టుమిషన్లు, ఆసుపత్రికి వీల్ ఛైర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.