ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఉండ్రాజవరం మండలం సత్యవాడలో రేషన్ షాపులను పునః ప్రారంభించిన మంత్రి దుర్గేష్
స్వయంగా లబ్ధిదారులకు రేషన్ సరకులు పంపిణీ చేసిన మంత్రి
ప్రజలకు నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలనే లక్ష్యం
ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో రేషన్ షాపులు
దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు డెలివరీ
రేషన్ కార్డుల జారీలో తలెత్తుతున్న ఇబ్బందులు సరి చేస్తున్నామని వెల్లడి.. పూర్తిస్థాయిలో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం
జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల కార్యకలాపాలు పునః ప్రారంభం
త్వరలో అదనంగా మరో 10000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు
ఏ సమయంలోనైనా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ – మంత్రి కందుల దుర్గేష్
అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుకి సంతృప్త స్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పునః పంపిణీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.ఆదివారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ రేషన్ పునః పంపిణీని ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు రేషన్ సరకులు స్వయంగా పంపిణీ చేశారు. ఏపీలోని పేద కుటుంబాలకు చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందుబాటులోకి తెచ్చామని, ఇకపై ప్రజలకు నిత్యావసరాలు నిరాటంకంగా అదించాలనే లక్ష్యంతో పనిచేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు.
15 రోజుల పాటు షాపులు ప్రజలకు అందుబాటులో రేషన్ షాపులు..దివ్యాంగులు,65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరకుల పంపిణీ
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పునః పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల రేషన్ పేద ప్రజలకు చేరువకాలేదన్నారు. గతంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో నిర్దేశిత పాయింట్లలో మాత్రమే రేషన్ వాహనాల ద్వారా పంపిణీ జరిగేదని తద్వారా ప్రజానీకం ఇబ్బంది పడ్డారని తెలిపారు. క్షేత్రస్థాయిలో రేషన్ సక్రమంగా పంపిణీ కాలేదన్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం రేషన్ బండి వద్దకే వచ్చి రేషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. ఈ దుర్భర పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై కేబినెట్ లో కూలంకషంగా చర్చించి రేషన్ షాపుల పునరుద్ధరణపై ఏకగ్రీవంగా ఆమోదయోగ్య నిర్ణయం తీసుకుందన్నారు. 15 రోజుల పాటు షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ప్రతిపక్షం రేషన్ షాపులపై దుష్ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాక్షసానందం పొందుతుందని ఆగ్రహించారు. దివ్యాంగులు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరకుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ప్రతి నియోజకవర్గంలో, మండలం, గ్రామంలో సంబంధిత డేటాను సేకరించామని వారందరికీ ఇంటివద్దనే రేషన్ అందేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ కార్డుల జారీలో తలెత్తుతున్న ఇబ్బందులు సరి చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 870 చౌక దుకాణాల ద్వారా 5,64,994 మంది కార్డు దారులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
అర్హులైన పేదలకే రేషన్ పంపిణీ..బియ్యం పక్కదారి పడితే డీలర్లపై చర్యలు.. మంత్రి కందుల దుర్గేష్
రేషన్ షాపుల ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజలు, రేషన్ షాపు డీలర్ల సహకారం అవసరమన్నారు. బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ షాపు డీలర్లు అర్హులైన పేదలకే పంపిణీ చేయాలన్నారు. బియ్యాన్ని స్వంత వ్యాపారాలకు వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రేషన్ డీలర్ల ఇబ్బందులు పరిష్కరిస్తామన్నారు. ఉండ్రాజవరం, పెరవలి మండలాల డీలర్లు స్టాక్ పాయింట్ సమీపంలోని తణుకులో ఉండాలని కోరిన వెంటనే కలెక్టర్ తో మాట్లాడి అమల్లోకి తేవాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు.
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా నిడదవోలులోనే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు..అదనంగా 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు
నిడదవోలు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయాధారితమైనదని, పంట దిగుబడి ఎక్కువేనని మంత్రి దుర్గేష్ తెలిపారు.రెక్కాడితేగానీ డొక్కాడని రైతాంగం ఉన్న ప్రదేశం ఇదని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాకు కేటాయిస్తే అందులో 1.20 లక్షల మెట్రిక్ టన్నులు నిడదవోలుకు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రైతుల ఇబ్బందులు గమనించి వియత్నాం పర్యటనలో ఉన్నప్పటికీ స్థానిక రైతాంగం సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు.సహజంగా పంట దిగుబడి ఎక్కువ కావడం వల్ల కొన్ని చోట్ల ధాన్యం మిగిలిందన్నారు. వాటి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ విషయమై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో చర్చించి అదనంగా మరో 10000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని చెప్పామన్నారు. కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేసి తీరుతామన్నారు. రైతుల విషయంలో మిల్లర్లు ఏ సమస్యతో వచ్చినా పరిష్కరిస్తానన్నారు. ఇప్పటికే మిల్లర్ల కోరిక మేరకు బ్యాంక్ గ్యారంటీ 1:2 నిష్పత్తిలో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనలేని పక్షంలో అవసరమైతే ధాన్యాన్ని ప్రభుత్వం ఇచ్చే ధరకే ప్రత్యేకంగా మిల్లర్ల ద్వారా కొనే ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రేపటి నుండి 1800 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తా మన్నారు. ప్రతి ధాన్యం గింజ కొన్న వెంటనే 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. కొన్ని సందర్భాల్లో 6 గంటల్లోనే అందిస్తున్నా మన్నారు. సమర్థుడైన మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో పౌరసరఫరాల శాఖ నడుస్తోందన్నారు. అధికారులు మంచి పనితీరు కనబరచి శాఖ పురోగతికి పాటుపడాలన్నారు.
ఈ-క్రాపింగ్ నమోదు , సంచులు ఇచ్చే సమయంలో, ధాన్యాన్ని ఆర్.ఎస్.కే ల ద్వారా కొనుగోలు చేసే సమయంలో సరైన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించానని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ధరల విషయంలో రైతుల అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. రైతులకు తలెత్తే ఇబ్బందులు అధిగమించాలని సూచించారు. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ విషయంలో ప్రతి కేబినెట్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో భిన్నమైన పరిస్థితుల కారణంగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతుందన్నారు.
నియోజకవర్గ సమస్యలకు కృషి..ప్రజల కోసం తాను ఏదైనా చేసేందుకు సిద్ధం
రాష్ట్ర మంత్రిగా తీరిక లేకుండా పర్యటిస్తున్నప్పటికీ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు నిర్విరామ కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ అన్నారు. తాను ఏ రకమైన వ్యాపారాలు, వ్యవసాయం చేయడం లేదని విద్యార్థి దశ నుండి రాజకీయమే జీవితంగా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నానన్నారు. రాజకీయం పరంగానే సమాజంలో మార్పు తీసుకురావాలని విశ్వసించే వ్యక్తినని, ప్రజల కోసం తాను ఏదైనా చేసేందుకు సిద్ధమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు ప్రజలు ఏ సమయంలో వచ్చినా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ఈ క్రమంలో తాను రాజమహేంద్రవరం, నిడదవోలు క్యాంపు కార్యాలయాల్లో, క్షేత్రస్థాయిలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
నిడదవోలు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి
నిడదవోలు అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని ఆ దిశగా పని చేసేందుకు కృషి చేస్తానన్నారు.నిడదవోలు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానన్నారు.ఇప్పటికే రూ.11 కోట్లతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తీసుకొచ్చానన్నారు. అనంతరం రూ. 20 కోట్లు తెచ్చామన్నారు. మొత్తంగా ఏడాది కాలంలోనే రూ.31 కోట్లతో సీసీ రోడ్లు, ఆర్ అండ్ బీ రోడ్లు, ఇతరత్రా రహదారులు వేస్తున్నామన్నారు. కేంద్ర నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ గా నియామకం పొందిన బూరుగుపల్లి శేషారావు, విశిష్ట అతిథులుగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఆర్డీవో రాణి సుస్మిత, పౌర సరఫరా అధికారి ఎమ్ ఆర్ ఆర్ ప్రేమ్ కుమార్, పౌర సరఫరాల అధికారులు, ఉండ్రాజవరం మండలం ఎంపీడీవో, డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ రావు, నిడదవోలు, పెరవలి తహసిల్దార్లు, సత్యవాడ ఉప సర్పంచ్ ప్రసాద్ రాజు, ప్రభావతి, కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.