రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలైన దళితుల అభివృద్ధికి ఎస్సీ కార్పొరేషన్ ను పున ప్రారంభించి, దళిత యువత భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ఎస్సీ రుణాలు మంజూరు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి తమ బ్రతుకు కాలమంతా రుణపడి ఉంటామని మాదిగ రక్షణ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు కండెల్లి శేఖర్ తెలిపారు. మండల కేంద్రమైన నల్లజర్లలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా మాదిగ రక్షణ పోరాట సమితి అధ్యక్షుడు మర్రి రమేష్, గోపాలపురం నియోజకవర్గం అధ్యక్షుడు వరిగేటి అనిల్ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్స్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి అతిత్వరలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అభయమివ్వడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును తక్షణమే అమలు చేసేందుకు చర్యలకు పూనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితోద్ధారకుడని దళిత నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాదిగ రక్షణ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు కండెల్లి శేఖర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు దోపిడికి గురయ్యాయని ఆరోపించారు. అందుకే 2024లో వైసీపీ పాలనకు చరమగీతం పాడుతూ కూటమిని పీఠం ఎక్కించామని స్పష్టం చేశారు. మాదిగలకు దశ దిశ అయినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, దేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అడుగుజాడల్లో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ తమకు ఆదర్శం అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అండదండగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి . పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ పురందరేశ్వరి, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాదిగల భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి నిత్యం అండగా నిలుస్తామని శేఖర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొల్లిపాం ప్రసాద్, మాదిగ రక్షణ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు కొండేపూడి గోపినాథ్, గేరా శ్రీను, మోదుగ సుబ్బారావు, కండెల్లి రాము,మర్రి అప్పారావు , వి.సాయికుమార్, యడ్లపల్లి పవన్ కుమార్, వై అంజి,బైపే శ్రీను,బి.వెంకటేశ్వర్రావు, కె.సూర్యచంద్రరావు, వై శ్రీను తదితరులు పాల్గొన్నారు.
